సాక్షి,అనంతపురం: హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని పామిడి మండలం పొగరూరు పరిధిలో వేగంగా ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తున్న ఐషర్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ప్రైవేట్ బస్సు నియంత్రణ కోల్పోయి, హైవేపై ఉన్న ఒక కల్వర్టు పైనుంచి కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా నలిగిపోవడంతో, బస్సు, ఐషర్ వాహనాల డ్రైవర్లు క్యాబిన్లలోనే ఇరుక్కుపోయారు. పోలీసులు, స్థానిక ప్రజలు తీవ్రంగా శ్రమించి, వాహనాల భాగాలను కట్ చేసి ఇద్దరు డ్రైవర్లను సురక్షితంగా వెలుపలికి తీశారు. గాయపడిన డ్రైవర్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులందరినీ వెంటనే చికిత్స నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంతో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


