
ముంబై: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఈ నెల 25న ముంబై విమానాశ్రయంలో దాదాపు 5 గంటలపాటు నిలిచిపోయింది. విమానం ఒక రెక్క దిగువ భాగంలో గడ్డి ఇరుక్కుపోయి ఉండటమే ఇందుకు కారణమని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. గమనించిన వెంటనే తొలగించి, విమానం టేకాఫ్కు క్లియరెన్స్ ఇచ్చామంది.
అయితే, ఆ విమానం ఏ రకానిది? అందులోని ప్రయాణికులు, సిబ్బంది సంఖ్య ఎంత? టేకాఫ్ షెడ్యూల్ సమయం? ప్రయాణికులు ఎంతసేపు విమానంలో ఉండిపోయారు? వంటి వివరాలను టాటా గ్రూప్ సారథ్యంలోని ఎయిరిండియా వివరించలేదు. రెక్క దిగువ భాగంలో గడ్డి ఎలా చేరిందని విషయాన్ని సైతం తెలపలేదు. అయితే, ముంబైలో ఉదయం 7.45 గంటలకు టేకాఫ్ తీసుకోవాల్సిన ఏఐ 2354 విమానం మధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరినట్లు ఫ్లయిట్రాడార్24. కామ్ ట్రాక్ రికార్డును బట్టి తెలుస్తోంది.