సంఘీభావం తెలుపుతున్న బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలు, ప్రతినిధులు
సంఘర్షణలు, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
ప్రపంచ వాణిజ్యం, సప్లై చైన్లు, ఇంధన సరఫరా సజావుగా కొనసాగాలి
గాజాలో హింసాకాండ సాగిస్తున్న ఇజ్రాయెల్పై ‘బ్రిక్స్’ఆగ్రహం
బ్రిక్స్ సదస్సులో ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’కు ఏకగ్రీవంగా ఆమోదం
పహల్గాం ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించిన కూటమి అధినేతలు
ఇరాన్పై అమెరికా, ఉక్రెయిన్పై రష్యా దాడులను ప్రస్తావించని డిక్లరేషన్
విచక్షణారహిత సుంకాలు, నాన్–టారిఫ్ చర్యలపై ఆందోళన
న్యూఢిల్లీ: సంఘర్షణలు, సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల్లోనే శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న భారతదేశం పిలుపును బ్రిక్స్ కూటమి దేశాల అధినేతలు సమరి్థంచారు. ఈ మేరకు శనివారం బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇరాన్తోపాటు సౌదీ అరేబియా, యూఏఈ సైతం ఆమోదం తెలిపాయి.
పశ్చిమాసియా యుద్ధంపై నెలకొన్న విభేదాలను పక్కనపెట్టి ఇరాన్, యూఏఈలు ఈ డిక్లరేషన్ విషయంలో ఒక్కటి కావడం విశేషం. భారతదేశానికి ఇది ముఖ్యమైన దౌత్యవిజయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయితే, ఈ ప్రకటనలో ఇరాన్పై అమెరికా దాడుల గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని కూడా తప్పుపట్టలేదు.
గాజాలో హింసాకాండ సాగిస్తున్న ఇజ్రాయెల్పై ఆగ్రహం వ్యక్తంచేశారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలు పరిష్కరించుకోవాలని, పాలస్తీనా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని తేల్చిచెప్పారు. ‘వర్తించే’అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ప్రపంచ వాణిజ్యం, సప్లై చైన్లు, ఇంధన సరఫరా సజావుగా కొనసాగానికి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని కూటమి నేతలు నొక్కిచెప్పారు. తొలుత ఇరాన్, యూఏఈలు తమ కఠిన వైఖరిని ప్రదర్శించడంతో ఈ డిక్లరేషన్ పాఠంపై చర్చలు చివరి నిమిషం వరకు కొనసాగాయి. బ్రిక్స్ అనేది ఏకాభిప్రాయం ఆధారంగా పనిచేసే కూటమి. ఏ ఒక్క సభ్య దేశం వ్యతిరేకించినా డిక్లరేషన్ ఆమోదం పొందదు.
ఏకపక్ష ఆంక్షలు, బలవంతపు చర్యలు వద్దు
విచక్షణారహిత సుంకాలు, నాన్–టారిఫ్ చర్యలు, సంరక్షణవాదం వంటి వాణిజ్య నిరోధక చర్యలపై బ్రిక్స్ దేశాలు తమ డిక్లరేషన్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇవి ప్రపంచ వాణిజ్యాన్ని మరింత తగ్గించి, సప్లై చైన్లకు అంతరాయం కలిగించి, ఇప్పటికే ఉన్న ఆర్థిక అసమానతలను మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలను పరోక్షంగా తప్పుపట్టాయి.
అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమైన ఏకపక్ష ఆంక్షలు, బలవంతపు చర్యలను తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపాయి. బ్రిక్స్ సదస్సులో తొలి రోజు చర్చల ముగింపు సందర్భంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఆమోదించినట్లు భారత ప్రధాని మోదీ ప్రకటించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నామని డిక్లరేషన్ పేర్కొంది. గరిష్ట సంయమనం పాటించాలని, పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టంచేసింది.
ఇతర దేశాల సార్వ¿ౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని తెలిపింది. ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉద్దేశాలు, సూత్రాలకు అనుగుణంగా పౌరులు, పౌర మౌలిక సదుపాయాలకు రక్షణ కల్పించాలని వెల్లడించింది. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి, భద్రత, స్థిరత్వానికి దోహదపడే దీర్ఘకాలిక అవగాహన కోసం చర్చలు, దౌత్యం ద్వారా ప్రయత్నాలను ముమ్మరం చేయడాన్ని ప్రోత్సహిస్తున్నామని స్పష్టంచేసింది.
ఉగ్రవాదులను కోర్టు ముందు నిలబెట్టాల్సిందే
గత ఏడాది జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో 26 మందిని బలిగొన్న ఉగ్రవాద దాడిని బ్రిక్స్ కూటమి అత్యంత తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నాసరే సహించడానికి వీల్లేదని, ఈ ముప్పును ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలన్న భారత్ పిలుపునకు పూర్తి మద్దతు తెలిపింది. ఉగ్రవాద సవాలును ఎదుర్కోవడంలో సమష్టి విధానాన్ని అవలంబించడానికి కూటమి నేతలు అంగీకరించారు. ‘‘సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాదుల కదలికలు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఆశ్రయం కల్పించడం సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం’’అని డిక్లరేషన్లో తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని ఏ మతం, జాతీయత, నాగరికత, జాతి సమూహంతో ముడిపెట్టకూడదని ఉద్ఘాటించారు.


