ఊరుకోము అంటూ 200 మంది జెన్‌ ఆల్ఫా విద్యార్థుల రాస్తారోకో | 200 Chhattisgarh Gen Alpha students block road for answers | Sakshi
Sakshi News home page

ఊరుకోము అంటూ 200 మంది జెన్‌ ఆల్ఫా విద్యార్థుల రాస్తారోకో

Aug 26 2026 7:56 PM | Updated on Aug 26 2026 8:36 PM

 200 Chhattisgarh Gen Alpha students block road for answers

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో సెలుడ్ గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 200 మంది విద్యార్థులు రోడ్డెక్కారు. సరైన మరుగుదొడ్లు, పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన రాకపోవడంతో వారు నిరసనకు దిగారు. 

స్వామి ఆత్మానంద ఉత్తకృష్ఠ హిందీ మాధ్యమ పాఠశాల విద్యార్థులు బుధవారం ఉదయం 9 గంటల సమయంలో నిరసన ప్రారంభించారు. తొలుత పాఠశాల గేట్లకు తాళాలు వేశారు. తర్వాత దుర్గ్-పాటన్ ప్రధాన రహదారిపై బజరంగ్ చౌక్ వద్దకు చేరుకుని రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

మరుగుదొడ్లు లేకపోవడం వల్ల పాఠశాలకు హాజరుకావడం కష్టంగా మారిందని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా బాలికలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దాదాపు 2 ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతోందని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా హామీలు మాత్రమే లభించాయని తెలిపారు.

ఇదీ చదవండి: 6 ఏళ్లకే ఈ బాలుడు ‘అభిజీత్‌ దీప్కే’లా అయిపోయాడు..

మేము ఎక్కడికి వెళ్లాలి?
తాము అదనపు సౌకర్యం కోసం నిరసన చేయడం లేదని, పాఠశాలలో తప్పనిసరిగా ఉండాల్సిన సదుపాయం కోసం పోరాడుతున్నామని విద్యార్థులు తెలిపారు. నిరసనలో పాల్గొన్న 8వ తరగతి విద్యార్థిని కింజల్ కుర్రే మాట్లాడుతూ.. మరుగుదొడ్లు లేకపోవడం బాలికలకు మరింత ఇబ్బందిగా ఉందని చెప్పారు. 

“అబ్బాయిలు బహిరంగ ప్రదేశాల్లో వెళ్లగలరు. మరి మేము బాలికలం ఎక్కడికి వెళ్లాలి?” అని ప్రశ్నించారు. ఇతర ప్రభుత్వ భవనాలను కొన్ని నెలల్లోనే నిర్మించగలిగినప్పుడు, దాదాపు 200 మంది విద్యార్థుల కోసం ఒక మరుగుదొడ్డి నిర్మించలేరా అని ఆమె ప్రశ్నించారు.

7వ తరగతి విద్యార్థిని వైశాలి మాట్లాడుతూ, పాఠశాలకు ప్రహరీ గోడ కూడా లేదని చెప్పారు. పాఠశాలలో 6 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉపాధ్యాయులు అధికారులకు సమయం ఇచ్చారని చెప్పారు.

ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే కారును కడగడానికి ఏ నీటిని వాడారంటే?

తహసీల్దార్ రావడంతో నిరసన విరమణ
పాటన్ తహసీల్దార్ రస్తోగి అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడే వరకు రాస్తారోకో కొనసాగింది. వారి ఫిర్యాదులను విన్న తహసీల్దార్ మరుగుదొడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తిస్తానని కూడా తెలిపారు. హామీ లభించడంతో విద్యార్థులు రాస్తారోకోను విరమించి పాఠశాలకు తిరిగి వెళ్లారు. దీంతో వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే నిర్మాణ పనులు వాస్తవంగా ప్రారంభమయ్యే వరకు వేచి చూస్తామని విద్యార్థులు తెలిపారు. సమస్య పరిష్కారం కాకపోతే మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement