కొత్తపల్లి: జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ దంపతులు ఆదివారం సాయంత్రం సంగమేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎస్పీ కుటుంబానికి పురోహితుడు తెలకపల్లి రఘురామ శర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా కృష్ణాపరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం గర్భాలయంలోని వేపధారు శివలింగానికి విశేష పూజకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ పురోహితులు ఎస్పీ కుటుంబ సభ్యులకు ఆలయ చరిత్రను వివరించారు.
జిల్లాలో మోస్తరు వర్షం
నంద్యాల(అర్బన్): జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. గోస్పాడు మండలంలో అత్యధికంగా 27.0 మి.మీ, పాములపాడు, అళ్లగడ్డ, శ్రీశైలం మండలాల్లో అత్యల్పంగా 1.4 మి.మీ వర్షం కురిసింది. మహానందిలో 22.8, నందికొట్కూరులో 20.4, బండిఆత్మకూరులో 19.8, శిరివెళ్లలో 13.4, రుద్రవరం 12.8, మిడుతూరు 10.6, నంద్యాల రూరల్ 6.4, ప్యాపిలి, గడివేముల 5.8, కొలిమిగుండ్ల 4.8, వెలుగోడు, 3.4, సంజామల, ఉయ్యాలవాడ, నంద్యాల అర్బన్లలో 3.2, చాగలమర్రి 2.6మి.మీ వర్షం కురిసింది.
నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 20వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులను స్వీకరించి, పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.
నేటి నుంచి దస్తావేజు లేఖరుల నిరవధిక సమ్మె
కర్నూలు(సెంట్రల్): ప్రైవేట్ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును నిరసిస్తూ జూలై 20 నుంచి 31వ తేదీ వరకు దస్తావేజు లేఖరులు నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్ఏ రెహమాన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 396ను రద్దు చేయాలని కోరుతూ చేపట్టే నిరవధిక సమ్మెకు ప్రజలు సహకరించాలని కోరారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ను ప్రైవేట్కు అప్పగించేందుకు ప్రభుత్వం పూనుకోవడం అన్యాయమన్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటైతే ఏళ్లుగా దస్తావేజు లేఖరులుగా పనిచేస్తున్న తమ జీవన భృతిని కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటన తమ విన్నపాన్ని దృష్టిలో ఉంచుకొని రిజిస్ట్రేషన్ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కోరారు.
ఎమ్మిగనూరుటౌన్: వేరుశనగ దిగుబడులు ఆదివారం కురిసిన వర్షానికి తడిచి పోయాయి. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో షెడ్లు లేకపోవడంతో పంట ఉత్పత్తులకు రక్షణ లేక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఆలూరు, ఆదోని, మంత్రాలయం, కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల నుంచి 15,757 బస్తాల్లో 4,727 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులను ఆదివారం విక్రయానికి తీసుకొచ్చారు. క్వింటా గరిష్టంగా రూ.8,540 ప్రకారం కొనుగోలు చేశారు. వర్షం కురవడంతో రైతులు ఆరబోసుకున్న పంట దిగుబడులు పూర్తిగా తడిసిపోయాయి.వర్షం వచ్చి డ్రైన్ నీరు వెనక్కు వచ్చి నీటిలో తన 12 సంచులకు పైగా నీట మునిగి కొట్టుకొనిపోయాయని రైతు కర్ణ కన్నీటి పర్యంతమయ్యాడు.


