మునుగోడు : ఉమ్మడి జిల్లాలోని పరిశ్రమల్లో స్థానిక యువతీ, యువకులకే ఉద్యోగాలు ఇవ్వాలని, అందుకోసం యువత ఉద్యమించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. గురువారం మునుగోడులో నిర్వహించిన ఏఐవైఎఫ్ 15వ జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. దేశ భవిష్యత్, రాజకీయాలను శాసించే శిక్తి సామర్థ్యాలు యువతలోనే ఉన్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువత సంక్షేమానికి ఇచ్చిన హామీలను విస్మరించి నిరుద్యోగ సమస్యని పెంచి పోషిస్తుందని ఆరోపించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేందర్ మాట్లాడుతూ నీట్ పరీక్షతో పాటు ఇతర పోటీ పరీక్షలు నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దింపాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ఈ సభలో తిరిపారి వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురిజ రామచంద్రం, ఆర్.అంజాచారి, నలపరాజు రామలింగయ్య, చాపల శ్రీను, సతీష్ కుమార్, భీమనపల్లి రమేష్, బుర్రి శేఖర్, జిల్లా యాదగిరి, ముదిగొండ మురళీక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం


