నల్లగొండ: కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్యకు సంబంధించి మృతురాలి ఇంటి పక్కన గత కొన్నిరోజులుగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను కూడా విచారిస్తున్న ట్లు సమాచారం. కాగా శుక్రవారం రూపారెడ్డి అంత్యక్రియలను హైదరాబాద్లోని గుర్రంగూడలో ఆమె స్వగృహం సమీపంలోని సాహెబ్నగర్ హిందూ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు పూర్తిచేశారు.
పలు కోణాల్లో దర్యాప్తు..
రూపారెడ్డి హత్య వెలుగులోకి వచ్చిన బుధవారం నుంచి ఇప్పటి వరకు పోలీసులు మృతురాలి బంధువులతో కలుపుకొని 50 మందిని విచారించినట్లు సమాచారం. పోలీసులకు లభించిన సీసీ పుటేజీ ద్వారా సుమారు 20 నుంచి 25 సంవత్సరాల వయస్సున్న ఎరుపు రంగు టీషర్ట్ ధరించిన వ్యక్తి గురించి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా మృతురాలి కాల్ డేటాతో పాటు ఆమె భర్త రాజేంందర్రెడ్డి కాల్ డేటాను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది.


