మంత్రివర్గ సమావేశానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు అజహరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు
కొంతమంది ఎమ్మెల్యేలు ఏదంటే అది మాట్లాడుతున్నారు
అలా మాట్లాడటం సరైంది కాదు.. ఏదైనా ఉంటే నాతో నేరుగా మాట్లాడండి
బయట వ్యాఖ్యలు చేసి, మీడియాతో మాట్లాడి నష్టం చేసుకోవద్దు
పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ఐక్యంగా ప్రయత్నిద్దాం
కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం రేవంత్రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు.. అందరం కలిసి ఐక్యంగా పనిచేస్తూ ముందుకెళ్దామని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ‘కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. అన్ని రకాలుగా కష్టపడుతూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఏదంటే అది మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటం సరైంది కాదు. ఇప్పటివరకు జరిగింది చాలు. ఇంకో రెండేళ్లు మాత్రమే సమయముంది. ఈ రెండేళ్లు కష్టపడి పనిచేసి, మళ్లీ అధికారంలోకి వచ్చేలా ఐక్యంగా ప్రయత్నిద్దాం..’ అని అన్నారు.
శుక్రవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత.. 10 నిమిషాల పాటు ఆయన రాజకీయ అంశాలపై మంత్రులతో చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గురించి ముఖ్యమంత్రి పరోక్షంగా ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఏది మాట్లాడినా తనతో నేరుగా లేదా పార్టీ వేదికలపై మాట్లాడాలే తప్ప బయట మీడియాతో మాట్లాడి నష్టం చేసుకోవద్దని సూచించారు.
అన్ని స్థాయిల్లో నియంత్రణ ఉండాలి..
జిల్లాల్లో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను జిల్లాల ఇన్చార్జి మంత్రులు సమన్వయం చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. వారికున్న సమస్యలను తీర్చడానికి ప్రయత్నించాలని, వారు బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా చూడాలని చెప్పారు. అంతర్గతంగా చర్చించుకునే అంశాలను యథాలాపంగా బయట ఎక్కడపడితే అక్కడ, ఎవరితోనూ పంచుకోవద్దని, ఎంతవరకు అవసరమో ఆ మేరకు ప్రస్తావించాలే తప్ప.. పార్టీకీ, ప్రభుత్వానికి నష్టం జరిగేలా వ్యవహరించొద్దంటూ సున్నితంగా హెచ్చరించినట్లు సమాచారం. ఎవరైనా ఆచితూచి మాట్లాడకపోతే అంతిమంగా మనందరికీ నష్టం జరుగుతుందని అలా జరగకుండా అన్ని స్థాయిల్లో నియంత్రణ ఉండాలని సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డట్టు సమాచారం.
బీఎల్ఓలను పూర్తిగా నమ్మొద్దు..
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) గురించి కూడా మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి రాష్ట్రంలో ఎస్ఐఆర్ కుట్ర చేస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలో రాకుండా ఉండాలనే దుగ్ధతో పనిచేస్తున్నాయని, ఈ కుట్రను సమష్టిగా ఎదుర్కోవాలని కోరారు. ‘ఎన్నికల సంఘం పక్షాన బీఎల్ఓలు ఉంటే.. పార్టీ పక్షా బూత్ లెవల్ ఏజెంట్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వం మనదే ఉంది కదా అని బీఎల్ఓలను నమ్మవద్దు. మన బీఎల్ఏలు ఎవరైనా సరిగా పనిచేయకపోతే వారిని వెంటనే తప్పించండి. చురుగ్గా ఉన్న వారిని నియమించండి.
అనామలిస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని, ఓటర్లకు అన్ని విధాలా సహకరించి వారి ఓట్లు పోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇన్చార్జి మంత్రులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జులు అందరూ అప్రమత్తంగా ఉండి అర్హులైన వారి ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది పార్టీ లైన్..’అని చెప్పినట్టు సమాచారం.


