సాక్షి,హైదరాబాద్: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తీపి కబురు అందించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్, ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, ఫారెస్ట్ శాఖల్లోని ఉద్యోగాలకు ఈ సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్రంలో ఇప్పటికే ఐదేళ్ల వయోపరిమితి పెంపు మే 18, 2026 నుంచి అమల్లో ఉంది. అయితే, నిరుద్యోగ యువత నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం.. తాజాగా మరో రెండేళ్లను అదనంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా శాఖల్లోని పోస్టులకు మొత్తం వయోపరిమితి పెంపు ఏడేళ్లకు (5+2) చేరినట్లయింది.
ప్రస్తుతం కొనసాగుతున్న పోలీస్ రిక్రూట్మెంట్లకు కూడా ఈ అదనపు వయోపరిమితి పెంపు నిర్ణయం వర్తిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పోలీస్, యూనిఫాం ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగులకు వయస్సు రీత్యా మరో గొప్ప అవకాశం లభించినట్లయింది.


