గండుపాపల ఎంపీపీ మెయిన్ స్కూల్
ప్రైవేట్ స్కూళ్లకు పంపుతామని చెబుతున్న తల్లిదండ్రులు
ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతున్నా దొరకని విద్యార్థులు
‘సర్కారు బడా.. వద్దులే సార్’ అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం గుండుపాపల ఎంపీపీ మెయిన్ స్కూల్లో 2026–2027 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంత వరకు ఒక్క అడ్మిషన్ కూడా లేకపోవడంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. మీ పిల్లలను మా స్కూళ్లో చేర్పించండి ప్లీజ్.. అంటూ ఇంటింటికీ తిరుగుతున్నా ఫలితం లేదని చెబుతున్నారు. పైగా ప్రైవేట్ స్కూళ్లకే పంపుదామనుకుంటున్నామని చెబుతున్నారని వాపోతున్నారు. ప్రస్తుతం ఈ స్కూల్లో 2 నుంచి 5వ తరగతి వరకు 19 మంది పిల్లలు ఉన్నారు. ఆ స్కూల్కు సంబంధించి అంగన్వాడీ కేంద్రంలో ఒకటో తరగతికి ప్రమోట్ అయ్యేందుకు నలుగురు ఉన్నారు. కానీ వారిలో ముగ్గురిని ప్రైవేటు స్కూల్కు పంపేందుకు వారి తల్లిదండ్రులు సిద్ధం అయ్యారు. ఒకరు మాత్రం స్కూల్ తెరచిన తర్వాత చూద్దాంలే అంటున్నారు. ఈ విషయమై ఎంఈఓ–2 రామచంద్రయ్య మాట్లాడుతూ.. గుండుపాపల ఎంపీపీ మెయిన్ స్కూల్లో ఇప్పటి వరకు ఒకటో తరగతిలో ఒక్కరూ చేరని మాట వాస్తవమేనన్నారు.
– దొర్నిపాడు


