ఢిల్లీ: అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండల్లో మైనింగ్ను వెంటనే అరికట్టి, అక్కడి వారసత్వ సంపదను కాపాడాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు వైఎస్సార్సీపీ ఎంపీ ఎం.గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కేంద్ర మంత్రికి ఒక వినతి పత్రం సమర్పించిన ఆయన, చారిత్రక బౌద్ధ పురావస్తు ప్రాంతం, శ్రీ ధర్మలింగేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న మైనింగ్ కార్యకలాపాలను తక్షణమే నిలిపి వేయించాలని, ఆ మొత్తం పంచదార్ల కొండ ప్రాంతాన్ని ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలని కోరారు.
ధనదిబ్బలు బౌద్ధ పురావస్తు స్థలం శాతవాహన కాలానికి చెందిన అత్యంత ప్రాచీన వారసత్వ కట్టడం అని, అది భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) రక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందిందని ఎంపీ గురుమూర్తి గుర్తు చేశారు. అలాగే పంచదార్లలోని శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయం తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆలయమని తెలిపారు. ఈ రెండు చారిత్రక వారసత్వ కట్టడాల సమీపంలో మైనింగ్, బ్లాస్టింగ్ కార్యకలాపాలు కొనసాగడం వల్ల పురావస్తు సంపదకు, సహజ వాతావరణానికి, శాశ్వత జలధారలకు తీవ్ర ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏఎస్ఐ రక్షిత ధనదిబ్బలు బౌద్ధ క్షేత్రానికి సుమారు 90 మీటర్లు, 190 మీటర్లు, 200 మీటర్ల దూరంలో మైనింగ్ జరుగుతోందని, ఉపగ్రహ చిత్రాలతో పాటు, క్షేత్రస్థాయి పరిశీలనల్లో కూడా ఆ విషయం తెలిందని, ఇంకా మైనింగ్ కొనసాగితే, అది పురావస్తు సంరక్షణ చట్టాల ఉల్లంఘన అవుతుందని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో పురావస్తు శాఖతో తక్షణ క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించాలని, మైనింగ్ ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని, నిపుణులతో కూడిన సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు మైనింగ్, బ్లాస్టింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని ఎంపీ గురుమూర్తి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పంచదార్ల మొత్తం ప్రాంతాన్ని ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలని కోరారు.


