తెలిసిన వారే చేశారా..?
కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లిలో సంచలనం సృష్టించిన ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసు దర్యాప్తు కొలిక్కి వస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు. గురువారం ఆయన హత్య జరిగిన రూపారెడ్డి ఇంటిని పరిశీలించి, కేసు దర్యాప్తు పురోగతిని దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ కేసును ఛేదించేందుకు డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని, 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
20 నిమిషాల్లోనే ఘాతుకం..
హత్య కేవలం 20 నిమిషాల్లోనే జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హత్యకు ముందు నిందితుడు ముఖానికి మాస్క్ ధరించి రూపారెడ్డి ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరించినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. మంగళవారం సాయంత్రం 5.41 గంటలకు ఇంటి వెనుక ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించిన నిందితుడు.. 20 నిమిషాల వ్యవధిలోనే హత్య చేసి తిరిగి గోడ దూకి ఎరుపు రంగు కారులో పరారైనట్లు అను మానిస్తున్నారు. నిందితుడు రూపారెడ్డి బ్యాగులో నుంచి సుమారు రూ.2లక్షల నగదు అపహరించినట్లు పోలీసులు నిర్దారించారు. అయితే, హత్యకు పాల్పడిన నిందితుడు ఒకరా, లేక ఇద్దరా అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. నిందితుడి వయస్సు సుమారు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు.
ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడి
ీససీ ఫుటేజ్ ఆధారంగా ముమ్మర దర్యాప్తు
సాధారణంగా సాయంత్రం 6 గంటలకు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే రూపారెడ్డి, హత్య జరిగిన రోజు మాత్రం సాయంత్రం 5.25 గంటలకే ఇంటికి చేరుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమెను కలిసేందుకు ఎవరో వస్తున్న విషయం ముందే తెలిసి ఇంటికి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా, హత్య జరిగిన ఇంట్లో రెండు టీ కప్పులను గుర్తించడం.. నిందితుడు రూపారెడ్డికి పరిచయం ఉన్న వ్యక్తే కావచ్చన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఘటనా స్థలం నుంచి ఎరుపు రంగు కారులో పరారైన నిందితుడు.. హత్యకు ఉపయోగించిన గ్లౌ జులను మార్గమధ్యలో చింతచెట్టు తండా వద్ద పా రేసినట్లు పోలీసులు గుర్తించారు.


