‘హైస్పీడ్‌’ కారిడార్‌ | - | Sakshi
Sakshi News home page

‘హైస్పీడ్‌’ కారిడార్‌

Jul 19 2026 2:02 AM | Updated on Jul 19 2026 2:02 AM

జిల్లా మీదుగా హైదరాబాద్‌ – చైన్నె రైల్వే లైన్‌

హాలియా, వాడపల్లిలో రైల్వే స్టేషన్లు

ప్రతిపాదనలు ఆమోదించిన

రాష్ట్ర కేబినెట్‌

గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే వెంట నిర్మించే అవకాశం

నాగార్జునసాగర్‌, గుర్రంపోడు, మర్రిగూడ :

హెస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌కు అనుసంధానంలో భాగంగా జరిగిన కీలక సవరణల జరిగాయి. హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీ నుంచి ప్రారంభమమ్యే గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు ఇప్పటికే మర్రిగూడ, గుర్రంపోడు, హాలియా, నాగార్జునసాగర్‌ ప్రాంతాల్లో డ్రోన్‌లతో సర్వే చేసి మార్కింగ్‌ చేశారు. తాజా కొత్తగా ప్రతిపాదించిన హైదరాబాద్‌ – చైన్నె హైస్పీడ్‌ రైలును మొదటగా నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ప్రతిపాదించగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఫ్యూచర్‌ సిటీ, మర్రిగూడ, హాలియా, వాడపల్లి మీదుగా ఎలైన్‌మెంట్‌ మార్చారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిసింది. దీంతో ఈ మార్గంలో శంషాబాద్‌, ఫ్యూచర్‌ సిటీ, డ్రైపోర్టు, హాలియా, వాడపల్లిలో హైస్పీడ్‌ రైలు స్టేషన్‌లుగా మార్చనున్నారు. రావిర్యాల ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎగ్జిట్‌ నుంచి కొత్త రేడియల్‌ రోడ్డు మీదుగా ప్రయాణించి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలో కలుస్తుంది.

డీపీఆర్‌ రూపకల్పన దిశగా ప్రాజెక్టు

హైదరాబాద్‌– చైన్నె హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డీపీఆర్‌ రూపకల్పనకు ప్రైవేట్‌ సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. హైస్పీడ్‌ రైలు మార్గాన్ని గ్రీన్‌ఫీల్డ్‌ హైవే మార్గంలోనే అధిక భాగం వచ్చేలా చేయడం వల్ల భూసేకరణ, పర్యావరణ సమస్యలను అధిగమించేలా ఈ మార్గం ఉత్తమమైనదిగా ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పోరేషన్‌లకు పంపించి ఎలైన్‌మెంట్‌, స్టేషన్ల స్థానాలకు ఖరారు చేసే దిశగా అడుగులు వేస్తోంది.

ప్రతిపాదనలు ఇలా..

ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం ఈ కారిడార్‌ మర్రిగూడ, గుర్రంపోడు, పెద్దవూర, అనుముల, తిరుమలగిరి(సాగర్‌), మిర్యాలగూడ, దామరచర్ల మండలాల మీదుగా వెళ్లనుంది. హాలియా వద్ద స్టేషన్‌ ఏర్పాటు చేస్తే.. నాగార్జునసాగర్‌ పర్యాటక కేంద్రానికి మరింత గుర్తింపు లభించనుంది. పర్యాటక రంగంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుంది. పర్యాటకుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

రైతుల ఆందోళన

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు సంబంధించి ఇప్పటికే గుర్తులు వేస్తుండడం.. ఇప్పుడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడంతో భూములు పోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. భూసేకరణ, పరిహారం విషయాలపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రైతులు అయోమయానికి గురువుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి అసలు ఏయే గ్రామాల గుండా ఈ మార్గాలు వెళ్తున్నాయో పూర్తి వివరాలు వెల్లడించి తమకు న్యాయం చేయాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.

శంషాబాద్‌

మర్రిగూడ

గుర్రంపోడు

జిల్లాకు కలిగే ప్రయోజనాలు

మర్రిగూడ నుంచి దామరచర్ల వరకు పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధికి ఊతం.

మిర్యాలగూడ వ్యవసాయ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా వేగవంతమైన రవాణా అవకాశాలు.

భూముల విలువ పెరగడంతో పాటు కొత్త పెట్టుబడులు వస్తాయి.

ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ అవకాశాలు.

హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్స్‌ లాజిస్టిక్స్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాలకు ఊతం.

విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజలు హైదరాబాద్‌ – చైన్నె నగరాలకు అత్యంత వేగంగా చేరుకునే సౌకర్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement