రామగిరి(నల్లగొండ) : టీజీఎస్ ఆర్టీసీ అన్ని బస్సుల్లో ఇక నుంచి ఆన్లైన్ చెల్లింపుల ద్వారా టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చని రీజినల్ మేనేజర్ టి.జ్యోస్న్స సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు చిల్లర సమస్యలతో చిరాకు పడాల్సిన అవసరం లేకుండా, సులభంగా డిజిటల్ చెల్లింపుల ద్వారా టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రజలంతా ఆర్టీసీ బస్సుల్లో అత్యధికంగా ప్రయాణించి, సంస్థ అభివృద్ధికి మనుగడకు తమ వంతు చేయూతను అందించాలని విజ్ఞప్తి చేశారు.
టీటీసీ పరీక్షకు హాల్ టికెట్లు
నల్లగొండ : టీటీసీ లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షకు హాజరు కానున్న అభ్యర్థులు www. bse.teangana.gov.in వెబ్సైట్ నుంచి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ సుశీందర్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 2న ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 వరకు మెథడ్స్ ఆఫ్ టీచింగ్ జనరల్ పరీక్ష, 3.30 గంటల నుంచి 4.30 వరకు మెథడ్స్ ఆఫ్ టీచింగ్ స్పెషల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్టికెట్, అనుమతి పత్రాలతో పరీక్ష సమయానికి గంట ముందే చేరుకోవాలని సూచించారు.
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా సతీష్కుమార్
నల్లగొండ టూటౌన్ : బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా చిట్యాల మండలం వనకిపాక గ్రామానికి చెందిన కంబాలపల్లి సతీష్కుమార్ యాదవ్ నియమితులయ్యారు. రాష్ట్రంలో 22 జిల్లాలకు బీజేవైఎం అధ్యక్షులను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సతీష్కుమార్ యాదవ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏఐటీయూసీ జిల్లా కమిటీ ఎన్నిక
గుర్రంపోడు : ఏఐటీయూసీ జిల్లా కమిటీని.. గుర్రంపోడులో నిర్వహించిన జిల్లా మహాసభల్లో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నూనె రామస్వామి, ప్రధాన కార్యర్శిగా పల్లా దేవేందర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేఎన్.రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎడమ సుమతమ్మ, బరిగెల వెంకటేష్, బంటు రాజేశ్వరి, సహాయ కార్యదర్శులు నూనె వెంకటేశ్వర్లు, దోటి వెంకన్న, ఎండీ జానీ, కోశాధికారిగా దోనకొండ వెంకటేశ్వర్లు, 39 మందిని కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నారు.
రైస్ మిల్లులో విజిలెన్స్ తనిఖీలు
● 4970 క్వింటాళ్ల ధాన్యం తేడాలు ఉన్నట్లు గుర్తింపు
డిండి : మండల పరిధిలోని చెర్కుపల్లి సమీపంలోని సాయి లక్ష్మీ రైస్ మిల్లులో సోమవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లులోని ధాన్యం నిల్వలు, స్టాక్ రిజిస్టర్, తదితర రికార్డులను పరిశీలించారు. దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగిన తనిఖీల్లో 4970 క్వింటాళ్ల ధాన్యం తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారని దేవరకొండ డీటీ సీఎస్ మోబీన్ తెలిపారు. ఈ విషయంపై నివేదిక తయారుచేసి జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. వారి వెంట ఆర్ఐ సైదులు ఉన్నారు.
23న కలెక్టరేట్ ముట్టడి
నల్లగొండ టౌన్ : విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న నల్లగొండ కలెక్టరేట్ ముట్టడి నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తెలిపారు. సోమవారం నల్లగొండలో జరిగిన ఏఐఎస్ఎఫ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల ఫీజుల బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మురళీకృష్ణ, యశ్వంత్, శోభన్బాబు, జిల్లా కోశాధికారి గోపగోని ఉదయ్, అరవిందు, మహేష్, తరుణ్ పాల్గొన్నారు.


