తమిళ హీరో విశాల్ ఏ సినిమా చేసినా సరే దాన్ని తెలుగులోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుంటాడు. అలా నిన్న(ఆగస్టు 14) థియేటర్లలో రిలీజైన మూవీ 'మకుటం'. ఇన్నేళ్ల కెరీర్లో తొలిసారి దీనితోనే దర్శకుడిగా మారాడు. అలానే తండ్రికొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. తీరా చూస్తే బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం పరిస్థితి ఘోరాతిఘోరంగా తయారైంది.
(ఇదీ చదవండి: విశ్వనాథ్ అండ్ సన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?)
విశాల్ 'మకుటం'(తమిళంల మగుడం) సినిమాకు తొలిరోజు తమిళనాడులో కేవలం రూ.38 లక్షలు రాగా తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.20 లక్షలు, కర్ణాటకలో రూ.7 లక్షలు, కేరళలో రూ.2 లక్షలు, దేశంలో మిగతా చోట్ల కలిపి రూ.లక్ష మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.68 లక్షల గ్రాస్ మాత్రమే వసూలైనట్లు తెలుస్తోంది. ఓవర్సీస్లో రూ.20 లక్షల వరకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఓవరాల్గా రూ.90 లక్షల వరకు వసూళ్లు సాధించిన ఈ సినిమాకు పేలవమైన ఆరంభం దక్కింది. ఇండిపెండెన్స్ డే వీకెండ్ ఏమైనా ప్లస్ అవుతుందా అనుకుంటే రెండో రోజు బుకింగ్స్ కూడా దారుణంగా ఉన్నాయి. చూస్తుంటే విశాల్కి దర్శకుడిగా ఆరంభమే భారీ డిజాస్టర్ దక్కేలా కనిపిస్తోంది. మూడేళ్ల క్రితం 'మార్క్ ఆంటోని'తో రూ.100 కోట్ల మార్క్ అందుకున్న విశాల్ పరిస్థితి ఇప్పుడిలా తయారవడం చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
'మకుటం' విషయానికొస్తే.. కృపాకరం (విశాల్) చెన్నైలో మెడికల్ రిప్రజెంటేటివ్. భార్య జమున (దుషారా విజయన్) ఇద్దరు పిల్లలతో హ్యాపీగా బతికేస్తుంటాడు. స్థోమత లేకపోవడంతో ఓసారి సెకండ్ హ్యాండ్ కారు కొని తన కుటుంబాన్ని తీసుకుని విహారయాత్రకు వెళ్తాడు. కొందరు దుండగులు కృపాకరం కారుపై కాల్పులు జరుపుతారు. ఈ ఘటనలో ఇతడి భార్య, బిడ్డ చనిపోతారు. ప్రాణాలతో మిగిలిన కొడుకుని పట్టుకుని పారిపోతాడు. ఈ విషయం తన తండ్రి, విశాఖపట్నం అక్కడి పోర్టుని శాసించే లింగ (విశాల్)కు తెలుస్తుంది.
బాధలో ఉన్న కొడుకుని చూడటానికి లింగ రాగానే కృపాకరం కోపంతో ఊగిపోతాడు. తన భార్య, బిడ్డల చావుకు లింగానే కారణమని ఆరోపిస్తాడు. అసలు తండ్రీ కొడుకులైన లింగ, కృపాకరం ఎందుకు విడివిడిగా ఉంటున్నారు? కృపాకరం కుటుంబంపై దాడి చేసిందెవరు? వాళ్లకీ లింగాకూ ఉన్న సంబంధమేంటి? అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ)


