కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వివాదం ఇంకా కొనసాగుతోంది. తన భార్య ఆర్తితో విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. గతేడాది ఏప్రిల్లో విడాకుల వివాదం తర్వాత ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. జయం రవి భరణం చెల్లించాలని ఆర్తి ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వివాదంతో వార్తల్లో నిలిచిన మరోవైపు కెరీర్లో సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఈ విడాకుల వివాదం నడుస్తున్న వేళ.. ఆయన భార్య ఆర్తి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఖుష్బు కూతురి పెళ్లికి హాజరైన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. కొన్ని ఫోటోలు మిమ్మల్ని ఒకప్పటి గతాన్ని గుర్తుచేస్తాయని తెలిపింది. మరికొన్ని, జీవితాంతం మనతో ఉన్న వ్యక్తులను గుర్తుకు తెస్తాయని రాసుకొచ్చింది. ఈ ఫోటోలు చూస్తుంటే.. అందులోని వ్యక్తులే నాకు ఎక్కువగా కనబడుతున్నారని పోస్ట్ చేసింది.
కాలం గడిచేకొద్దీ కుటుంబంలా మారిపోయిన స్నేహితులు.. మన జీవితంలోని వివిధ దశలను చూసిన వారు.. మనతోనే ఉండాలని నిర్ణయించుకున్న వారే.. మన పక్కన నిలబడతారని ఎమోషనల్గా రాసుకొచ్చింది. ఎందుకంటే జీవితం మారుతుంది.. మనుషులు మారుతారు.. పరిస్థితులు మారుతాయి.. కానీ కష్టకాలంలో నా పక్కన నిలబడిన వారే నిజమైన ఆప్తులవుతారని పోస్ట్ చేసింది.
తప్పనిసరి పరిస్థితుల వల్ల కాకుండా.. తమ ఇష్టంతో మాతో నిలిచిపోయే వ్యక్తులలో ఒక అమూల్యమైన విషయం ఉంటుందని ఆర్తి తెలిపింది. ఇవి నాకు కేవలం పెళ్లి ఫోటోలు మాత్రమే కాదు.. జీవితంలో చిన్న, పెద్ద మార్గాల్లో నాకు అండగా నిలిచి.. ఇప్పటికీ నిలుస్తున్న వ్యక్తులను గుర్తు చేసే చిన్న జ్ఞాపకాలని ఎమోషనలైంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.


