మూడు నెలల క్రితం 'కరుప్పు'(తెలుగులో వీరభద్రుడు)తో హిట్ కొట్టిన సూర్య.. ఇప్పుడు 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో వచ్చేశాడు. దీనికి తెలుగువాడైన వెంకీ అట్లూరి దర్శకుడు కాగా, నాగవంశీ నిర్మాత. మమిత బైజు హీరోయిన్. రాధిక, రవీనా టండన్ కీలక పాత్రలు చేశారు. తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
సంజయ్ విశ్వనాథ్(సూర్య) ఓ వ్యాపారవేత్త, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్. 40 ఏళ్లు వయసొచ్చినా పెళ్లి చేసుకోడు. అమెరికాకి వెళ్లి సరోగసి ద్వారా మగబిడ్డని కని స్వదేశానికి తిరిగొస్తాడు. కొన్నాళ్ల తర్వాత పిల్లాడు ఓ అరుదైన వ్యాధి బారిన పడతాడు. బోన్ మారో(ఎముక గుజ్జు) ట్రాన్స్ ప్లాంట్ అవసరమవుతుంది. దీంతో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అవసరం ఏర్పడుతుంది. అమెరికాకు తిరిగెళ్లి సరోగసి మదర్ మ్యాడీ (మమిత)ని వెతికి భారత్కి తీసుకొస్తాడు. సర్జరీ తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోవాలని ముందే ఒప్పందం చేసుకుంటాడు.
20 ఏళ్ల మ్యాడీ.. సంజయ్ ఇంటికి వచ్చిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు సంజయ్ 40 ఏళ్లు వచ్చినా పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? తల్లి అవసరం లేకుండా తన కొడుకును పెంచుకోగలిగాడా? మ్యాడీ ప్రేమని సంజయ్ ఎందుకు తిరస్కరించాడు? చివరకు పెళ్లి విషయంలో సంజయ్ తన ఆలోచన మార్చుకున్నాడా లేదా? అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
కుటుంబ నేపథ్యంలో సాగే సినిమా ఇది. సాంప్రదాయాలు, బంధాలు, తల్లి-కొడుకుల మధ్య ఉండే భావోద్వేగాల చుట్టూ కథ తిరుగుతుంది. దర్శకుడు వెంకీ అట్లూరి ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా దాని చుట్టూ అల్లిన సన్నివేశాలు, మానవ సంబంధాలని హృదయాలను హత్తుకునేలా తీర్చిదిద్దాడు. కాసేపు నవ్విస్తూ మరి కాసేపు భావోద్వేగానికి గురిచేస్తూ బోర్ కొట్టకుండా కథనాలు నడిపించాడు.
సంజయ్ విశ్వనాధ్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించే సన్నివేశంతో మూవీ ప్రారంభమవుతుంది. తర్వాత సంజయ్ ఫ్యామిలీ నేపథ్యం, మంచి వ్యాపారవేత్తగా ఎదిగిన తీరు చూపించారు. ఆ వెంటనే బిడ్డ కోసం సరోగసి మార్గం ఎంచుకోవడం... కొడుకు సర్జరీ కోసం సరోగసి మదర్ మ్యాడీ ఇండియాకు రావడంతో కథ కామెడీ టర్న్ తీసుకుంటుంది. మ్యాడీ చేసే అల్లరి థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. అదే సమయంలో తల్లితో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు గుండెని బరువెక్కిస్తాయి.
టీవీ షో ఎపిసోడ్ అయితే కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తి పెంచుతుంది. ద్వితీయార్థంలో కథనం చాలావరకు ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. మదర్ ఎపిసోడ్లో తెరపై సూర్య కన్నీళ్లు పెట్టుకుంటే సీట్లో ఉన్న ప్రేక్షకుడి గుండె బరువెక్కుతుంది. ఆ తర్వాత కథనం కొంతవరకు నెమ్మదిగా సాగుతుంది. పెళ్లి ఎపిసోడ్ అయితే కొంత సాగదీత అనిపిస్తుంది. క్లైమాక్స్ రొటీన్గానే ఉంది.
ఎవరెలా చేశారంటే?
సంజయ్ విశ్వనాధ్ పాత్రల్లో సూర్య ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన కన్నీళ్లు తెప్పిస్తుంది. మమితకు మంచి పాత్ర లభించింది. మ్యాడీగా ఆమె చేసే అల్లరి నవ్వులు పూయిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మమిత పాత్రను మర్చిపోరు. తల్లిగా రాధిక చక్కగా నటించింది. మిగిలిన వాళ్లు తమతమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విషయాలకొస్తే మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ప్రతి సీన్ తెరపై చాలా రిచ్గా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. సెకండాఫ్లో కొన్ని సీన్లని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఇదో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్.
అంజి శెట్టే , సాక్షి వెబ్ డెస్క్


