ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు.. డిప్రెషన్‌లోకి వెళ్లా: శ్రీనిధి శెట్టి | Srinidhi Shetty Got Emotional In A Interview Telling About Her Mother | Sakshi
Sakshi News home page

పదో తరగతిలోనే అమ్మ చనిపోయింది.. డిప్రెషన్‌లోకి వెళ్లా : శ్రీనిధి శెట్టి

May 8 2025 1:14 PM | Updated on May 8 2025 2:41 PM

Srinidhi Shetty Got Emotional In A Interview Telling About Her Mother

తక్కువ సినిమాలతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించిన నటి శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty ). యష్ నటించిన ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన ఈ కన్నడ భామ, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’తో దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గడించింది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత శ్రీనిధికి వరుసగా అవకాశాలు వచ్చాయి. తమిళంలో విక్రమ్‌తో ‘కోబ్రా’ చిత్రంలో నటించగా, నాని నటించిన ‘హిట్: ది థర్డ్ కేస్’(HIT3)తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఎదగడానికి శ్రీనిధి చాలానే కష్టపడింది. ఎన్నో బాధలను అదిగమించి ఈ స్థాయికి చేరుకుంది. చిన్నతనంలోనే ఆమె అమ్మను కోల్పోయింది. కొన్నాళ్ల పాటు డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిందట. బెంగళూరికి వచ్చిన తర్వాతే తన జీవితం మారిపోయిందంటోంది శ్రీనిధి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తల్లి గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్‌ అయింది.

‘నేను పదో తరగతి చదువుతున్న సమయంలో మా అమ్మ చనిపోయింది. ఆ షాక్‌ను నేను తట్టుకోలేకపోయాను. కొన్నాళ్లపాటు డిప్రెషన్‌లోకి వెళ్లాను. ఆ ఇంట్లోనే ఉండాలనిపించలేదు. గతాన్ని మర్చిపోయేందుకు బెంగళూరుకు వెళ్లిపోయాను. అయినా, అమ్మను మర్చిపోలేకపోయాను. చాలా రోజులు ఆమెను తలుచుకుంటూ ఏడ్చాను. ఈ ఘటన నుంచి బయటపడడానికి చాలా సమయం పట్టింది. 

బెంగళూరుకు వచ్చిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. జైన్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత, కొంతకాలం అక్సెంచర్‌లో ఉద్యోగం చేశా. మోడలింగ్‌పై ఆసక్తితో ఆ రంగంలోకి అడుగుపెట్టాను. 2016లో మిస్ సుప్రానేషనల్ టైటిల్‌ గెలవడం.. అక్కడ సినిమాల్లోకి రావడం.. పాన్‌ ఇండియా సినిమాల్లో నటించడం.. ఇవన్నీ ఓ కలలా అనిస్తున్నాయి’ అని శ్రినిధి చెప్పుకొచ్చింది. ఇక తండ్రి గురించి మాట్లాడుతూ.. నాన్నతో ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాను. ఆయన నాకు చాలా సపోర్ట్‌గా ఉన్నారు’ అని చెప్పింది.

శ్రినిధి సినీ కెరీర్‌ విషయానికొస్తే.. ‘హిట్: ది థర్డ్ కేస్’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమెకు.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం, సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న ‘తెలుసు కదా’, కిచ్చా సుదీప్‌తో ‘కిచ్చా 47’ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇటీవల నితేష్ తివారీ రామాయణంలో సీత పాత్ర కోసం ఆమెకు అవకాశం రాగా, ‘కేజీఎఫ్’లో యష్‌తో జంటగా నటించిన కారణంగా ఆ పాత్రను వదులుకున్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement