
హీరోయిన్కి ఎలాంటి లక్షణాలు ఉండాలి? అంటే యాక్టింగ్ టాలెంట్ లేదంటే ప్రేక్షకుల్ని రప్పించగలిగే గ్లామర్ ఉండాలి కదా అని చాలామంది అంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందని అంటోంది ఒకప్పటి హీరో రాజశేఖర్ కూతురు. హీరోయిన్గా ఐదు సినిమాలు చేసిన ఈమె.. తన ఛాన్సుల కష్టాల గురించి చెబుతోంది. ఇన్ స్టాలో ఫాలోవర్స్ లేరని తనని సినిమా నుంచి తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటోంది. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశమవుతోంది.
హీరో రాజశేఖర్-జీవిత దంపతులకు శివానీ, శివాత్మిక అని ఇద్దరు కూతుళ్లు. వీళ్లలో శివాత్మిక చిన్నమ్మాయి. 2019లో 'దొరసాని' అనే సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది మోస్తరుగా ఆడింది. కానీ తమిళంలో ఓ రెండు చిత్రాలు చేసింది. 2022లో మళ్లీ 'పంచతంత్రం', 2023లో 'రంగమార్తండ' మూవీస్లో నటించింది. తర్వాత కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు.
(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాత్మిక.. తనకు ఇన్ స్టాలో సరైన ఫాలోవర్స్ లేకపోవడంతో కొన్ని సినిమాల నుంచి హీరోయిన్గా తీసేశారని, మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న కొందరికి అవకాశమిచ్చారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఏ మేనేజర్ లేదా ఏజెంట్ని కలిసినా సరే ఇన్ స్టాలో ఫాలోవర్స్ని పెంచుకోమంటున్నారని తన ఆవేదనని చెప్పుకొచ్చింది. అయితే తాను ఓ యాక్టర్ అని కంటెంట్ క్రియేట్ చేయడం తన పనికాదని చెప్పింది.
శివాత్మిక చెప్పడం అని కాదు గానీ రీసెంట్ టైంలో సోషల్ మీడియా నుంచి వచ్చి హీరోయిన్లు అయినవాళ్లు ఉన్నారు. వాళ్లలో వైష్ణవి చైత్యన ఒకరు. తొలుత ఆల్బమ్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఈమె.. 'బేబి' మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కానీ తర్వాత వచ్చిన 'లవ్ మీ', 'జాక్' చిత్రాలతో ఘోరమైన ఫ్లాప్స్ అందుకుంది. రీసెంట్గా నిహారిక ఎన్ఎమ్ కూడా ఇలానే హీరోయిన్ అయింది. తొలుత తమిళంలో సినిమాలు చేసింది. ఇప్పుడు 'మిత్రమండలి' మూవీలో హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.
(ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. ఉపాసన పోస్ట్ వైరల్)