‘రామాయణ’ ట్రైలర్ విడుదల వేడుకలో చిత్రబృందం
రామాయణం ఆధారంగా రూపొందిన తాజా హిందీ సినిమా ‘రామాయణ’. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ ఏడాది దీపావళికి ‘రామాయణ: పార్ట్ 1’, వచ్చే ఏడాది దీపావళికి ‘రామాయణ: పార్ట్ 2’ విడుదల కానున్నాయి. ఈ చిత్రంలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటించారు. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్నారు. తొలి భాగం ట్రైలర్ ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కాగా, ఢిల్లీలో ‘ప్రథమ్ సంకల్ప్’ పేరిట వేడుక నిర్వహంచి, ఈ సినిమా హిందీ 3డీ ట్రైలర్ను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి యోగా గురువు రామ్దేవ్ బాబా అతిథిగా హాజరై, ట్రైలర్ నచ్చిందని చెప్పి, ఈ సినిమాకు ప్రేక్షకాదరణ లభించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో రణ్బీర్ మాట్లాడుతూ– ‘‘రామానంద్ సాగర్గారు తీసిన ‘రామాయణం’ (సీరియల్)లో శ్రీరాముడిగా అరుణ్ గోవిల్గారు అత్యద్భుతంగా నటించారు. తరాలుగా శ్రీరాముడి పాత్రలో అరుణ్గారిని చూసి, ప్రేక్షకులు స్ఫూర్తి పొందారు. నేను చిన్నప్పట్నుంచి శ్రీ రాముడి కథలు వింటూ, ఆయన నామస్మరణ, ఆశీస్సులతో పెరిగాను. అలాంటి శ్రీరాములవారి పాత్రను పోషించే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు.
సాయిపల్లవి మాట్లాడుతూ– ‘‘సీతమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం. ఆ సీతమ్మే నాతో ఆమె పాత్ర చేయిస్తుందని, సీతమ్మకు కావాల్సినట్లుగా నా చేత నటింపజేసుకుంటుందని నమ్మి నేను ఈ రోల్ చేశాను. ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నించాను’’ అన్నారు. యశ్ మాట్లాడుతూ– ‘‘మన శ్రీరాముడి కథను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశంతో ఈ ‘రామాయణ’ చేశాం’’ అని అన్నారు.
‘‘మన గొప్ప ఇతిహాసాల్లో ఒకటైన ‘రామాయణం’ని ప్రపంచంతో పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం’’ అని తెలిపారు నమిత్ మల్హోత్రా. ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకులు రామాయణంలోని భావోద్వేగం, మానవత్వం, వేల సంవత్సరాలుగా దాన్ని చిరస్థాయిగా నిలబెట్టిన ఆత్మను కూడా అనుభూతి చెందుతారని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు నితీష్ తివారి. ఈ చిత్రంలో నటించిన సన్నీ డియోల్, రవి దూబే, అరుణ్ గోవిల్, శోభన, అజింక్య, కునాల్ కపూర్, రకుల్ ప్రీత్ తదితరులు పాల్గొన్నారు.


