సాక్షి డిజిటల్ అపూర్వ నివాళి
ఒక్కటే గొంతు... దాదాపు ఇరవై భాషల్లో 45 వేల కంటే ఎక్కువ పాటలను ఆలపించి, ఆరు దశాబ్దాలుగా కోట్లాది మంది హృదయాలను మురిపించిన కమ్మని కంఠం మన శిష్టాల జానకమ్మ. ఈ అమర గాన కోకిల భౌతికంగా దూరమైనా, ఆవిడ పంచిన గానామృతం తరతరాల పాటు విశ్వమంతటా మారు మోగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో సంగీత సామ్రాజ్ఞి ఎస్. జానకి స్మరణార్థం ‘సాక్షి డిజిటల్’ సగర్వంగా ‘జన గాన ఘన నీరాజనం’ పేరిట ఒక అపూర్వమైన డిజిటల్ నివాళి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
జానకమ్మకు మనసారా వీడ్కోలు పలుకుతూ, ఆమె జ్ఞాపకాలను పదిలపరచుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరినీ ఈ వేదిక ద్వారా ఒకే తాటిపైకి తెస్తోంది. ఈ మహోన్నతమైన కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి సంగీత ప్రియులు, అభిమానులు తమకు నచ్చిన జానకమ్మ పాటను గానీ, ఆవిడ గురించిన మాటలను గానీ ఒక నిమిషం పాటు రికార్డ్ చేసి #tribute2 janaki పేరిట అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇలా దేశ విదేశాల నుండి వచ్చే అభిమానుల సందేశాలను, గీతాలను క్రోడీకరించి ఆగస్టు 21న ప్రత్యేక నీరాజన కార్యక్రమంగా ‘సాక్షి డిజిటల్’ ప్రసారం చేయనుంది. ఆ మధుర గాయని వైభవాన్ని, సంగీత ప్రస్థానాన్ని స్మరించుకుంటూ సగర్వంగా సమర్పించే ఈ స్వరార్చనలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాం.


