breaking news
legendary singer
-
గాన కోకిల జానకమ్మకు జన గాన ఘన నీరాజనం
ఒక్కటే గొంతు... దాదాపు ఇరవై భాషల్లో 45 వేల కంటే ఎక్కువ పాటలను ఆలపించి, ఆరు దశాబ్దాలుగా కోట్లాది మంది హృదయాలను మురిపించిన కమ్మని కంఠం మన శిష్టాల జానకమ్మ. ఈ అమర గాన కోకిల భౌతికంగా దూరమైనా, ఆవిడ పంచిన గానామృతం తరతరాల పాటు విశ్వమంతటా మారు మోగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో సంగీత సామ్రాజ్ఞి ఎస్. జానకి స్మరణార్థం ‘సాక్షి డిజిటల్’ సగర్వంగా ‘జన గాన ఘన నీరాజనం’ పేరిట ఒక అపూర్వమైన డిజిటల్ నివాళి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.జానకమ్మకు మనసారా వీడ్కోలు పలుకుతూ, ఆమె జ్ఞాపకాలను పదిలపరచుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరినీ ఈ వేదిక ద్వారా ఒకే తాటిపైకి తెస్తోంది. ఈ మహోన్నతమైన కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి సంగీత ప్రియులు, అభిమానులు తమకు నచ్చిన జానకమ్మ పాటను గానీ, ఆవిడ గురించిన మాటలను గానీ ఒక నిమిషం పాటు రికార్డ్ చేసి #tribute2 janaki పేరిట అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.ఇలా దేశ విదేశాల నుండి వచ్చే అభిమానుల సందేశాలను, గీతాలను క్రోడీకరించి ఆగస్టు 21న ప్రత్యేక నీరాజన కార్యక్రమంగా ‘సాక్షి డిజిటల్’ ప్రసారం చేయనుంది. ఆ మధుర గాయని వైభవాన్ని, సంగీత ప్రస్థానాన్ని స్మరించుకుంటూ సగర్వంగా సమర్పించే ఈ స్వరార్చనలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాం. -
వెలుగుతూ ఉంటావు ఒక దివ్వెగా...
నేడు లక్షల ఇళ్లలో రేడియో వాల్యూమ్ తగ్గిపోయింది. కోట్లాది గుండెల్లో ప్రతిధ్వనించిన గాన విశ్వవిద్యాలయం మూగబోయింది. ఆ సింపుల్ చీర... ఆ చిరునవ్వు కానరావు. ఆ ప్రవాహస్వరం వినుటకు దొరకదు. ‘వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా... నే మిగిలి ఉంటాను తొలి నవ్వుగా... తొలి నవ్వుగా’.. అని వాగ్దానం చేస్తూ జానకమ్మ స్వరవాయులీనంలో ఐక్యమైంది. ఆమెకు నివాళి.జానకి గురించి ఇలా మొదలెట్టొచ్చు. మహా సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ ఒక పాట రికార్డ్ చేస్తున్నారు ఆమెతో. తెలుగులో వచ్చిన ‘ఇది కథ కాదు’కు తమిళ వెర్షన్ ‘అవర్గళ్’లోని ‘గాలికదుపు లేదు’ పాట అది. ఆ పాట హైపిచ్లో ఉంటుంది. పాట ఎత్తుకోవడమే గమకాలతో ఆలాపన ఉంటుంది. ఎస్. జానకీకి అవన్నీ ఏం పట్టె? మంచినీటి గ్లాసు. ఆమె గొంతు విప్పి స్పీకర్లు అదిరేలా ‘గాలికదుపు లేదు’ పాడి సింగిల్ టేక్లో ఓకే చేసింది.ఈ అమ్మాయికి ఇంత టాలెంట్ ఏమిటని మెల్లగా పంచెకట్టు సర్దుకుంటూ రికార్డింగ్ థియేటర్ నుంచి బయటకి వచ్చిన విశ్వనాథన్ హడలిపోయారు.బయట బీభత్సమైన గాలి. హోరు వాన. ఆయన టక్కున లోపలికొచ్చి జానకికి ఒక నమస్కారం పెట్టారు. ‘తల్లీ... ఇకపై నీ చేత ఆచి తూచి పాడించాలి. పంచభూతాలను కూడా కదిలించే శక్తి నీ పాటకు ఉంది’.1962.తమిళ సినిమా ‘కొంజుం సలంగై’. ఇందులో హీరోయిన్ సావిత్రి తమిళ సన్నాయి విద్వాంసుడైన జెమినీ గణేశన్ తోడుగా దేవుణ్ణి స్తుతిస్తూ ఒక పాట పాడాలి. సంగీత దర్శకుడు సుబ్బయ్య నాయుడు పాటైతే కట్టాడు గానీ పాడే గాయని ఎవరు? పి. లీల దగ్గరకు వెళితే ‘అంత శ్రుతిలో పాడలేను’ అని ఓటమి అంగీకరించారు. విజేత ఎవరో ఆచూకీ ఇచ్చారు... ఎస్. జానకి. ‘నీ లీల పాడెద దేవా’.... కారుకురిచ్చి అరుణాచలం నాదస్వరానికి దీటుగా మహా మేటిగా. సన్నాయి వింటే జానకి గొంతు గుర్తుకు వస్తుంది తెలుగు వారికి.‘పగలే వెన్నెల జగమే ఊయల’...జానకి తన పాటలతో అలా పగలే వెన్నెల తెచ్చింది సినిమాల్లో. ఏరు పరిగెత్తినంత చులాగ్గా ఆమె పాడుతుంటే శ్రోతలు శిశువులయ్యారు. శిశువులు కూడా శిరస్సులూపారు. ఎవరు ఈ జానకి అని అందరూ ఆరాలు తీశారు. ఈ జానకి రేపల్లె దగ్గర పుట్టింది. గోదావరి, కృష్ణాతీరాల మధ్య పెరిగింది. సిరిసిల్లా మగ్గం సవ్వడిలో లయను పట్టుకుంది. ఆంధ్ర, తెలంగాణ... రెండు చోట్లా సంగీతాన్ని తెలుసుకుంది. ‘గురువులు రాగాల ప్రాథమిక సూత్రాలు నేర్పితే... సృష్టిలోని భావాలన్నింటినీ ఈశ్వరుడే నా గొంతులో నింపాడు’ అని తెలుసుకుంది. ఇక మద్రాసుకు ప్రయాణం కట్టింది.చెన్నైకి చేరేనాటికి ఆమె వయసు 19 ఏళ్లు. చేతిలో పెద్దగా డబ్బుల్లేవు. కేవలం గొంతుని నమ్ముకుంది. అప్పట్లో లబ్ధప్రతిష్ఠులైన ఏవీఎం స్టూడియోస్ వారు నిర్వహించిన వాయిస్ ఆడిషన్స్లో జానకి గొంతు విని సంగీత దర్శకులు నిర్ఘాంతపోయారు. నెలకు వంద రూపాయల జీతంతో ఆమెను స్టూడియో ప్యానెల్ సింగర్గా చేర్చుకున్నారు. 1957లో ‘విధియిన్ విలయాట్టు’ అనే తమిళ సినిమాతో ప్రస్థానం మొదలైంది. అదే ఏడాది తెలుగులో ‘ఎమ్మెల్యే’ (1957) అనే చిత్రంలో ఘంటసాలతో కలిసి ‘నీ ఆశ అడియాస’ పాడింది. జానకమ్మ పాడిన తీరు చూసి, మద్రాస్ సినీ సంగీతం ఆమెకు వాకిలి తీసి స్వాగతం పలికింది. జానకమ్మ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే నాటికి తెలుగు, తమిళ పరిశ్రమలను పి. సుశీల, పి. లీల ఏలుతున్నారు. ముఖ్యంగా పి. సుశీల స్పష్టమైన తెలుగు ఉచ్చారణ, తిరుగులేని గానం మధ్య కొత్తగా వచ్చిన జానకి నిలదొక్కుకోవడం సామాన్యం కాదు. కానీ జానకమ్మ తనకంటూ ఒక ప్రత్యేకమైన అస్త్రాన్ని ఎంచుకున్నారు... అదే ‘వాయిస్ మాడ్యులేషన్, ఎక్స్ప్రెషన్ ’. సుశీలగారు క్లాసిక్ గాంధర్వ గాత్రంతో అలరిస్తే, జానకి ఒకే రోజు రికార్డింగ్లో అల్లరి, కరుణ, శోకం, శృంగారం పలికించేవారు. సుశీలతో పోటీని ఈర్ష్యతో కాకుండా తన విలక్షణమైన గొంతు మార్పిడి విద్యతో ఎదుర్కొని, ఎవరికీ సాధ్యం కాని ‘క్వీన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ’గా తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని లిఖించుకున్నారు. తెలుగులో ఎన్ని హిట్ పాటలు జానకి వశమయ్యాయి. ‘పిలువకురా అలుగకురా’, ‘పగలే వెన్నెల’, ‘నీలి మేఘాలలో’... ‘గున్నమామిడి కొమ్మ మీద’... ‘నాంపల్లి టేషనుకాడి’.... సుశీలను ఎంతో అభిమానించే ఎం.ఎస్. విశ్వనాథన్ జానకికి అద్భుతమైన పాటలు తెలుగు, తమిళంలో ఇచ్చారు. ‘అందమైన లోకమని రంగు రంగులుంటాయనీ’, ‘కన్నెపిల్లవని వన్నెలున్నవని’..... శ్రోతలకు ఇష్టం. మరోవైపు తెలుగులో చక్రవర్తి, రమేష్ నాయుడు తదితర సంగీత దర్శకులు ఆమెకు ఎక్కువ పాటలు ఇచ్చారు. చక్రవర్తి సంగీతదర్శకత్వంలో పాడిన ‘ఈ దుర్యోధన దుశ్శాసన’ పాట జాగృత గీతంలా నిలిచింది. చక్రవర్తి సంగీతంలోనే ‘జ్యోతి’ కోసం చేసిన ‘సిరిమల్లె పువ్వల్లే నవ్వు’ పాటలో జానకి నవ్వు మరొకరు ఇమిటేట్ చేయలేనిది. రమేష్ నాయుడు సంగీతంలో పాడిన ‘సిగ్గు పూబంతి’, ‘అలివేణి ఆణిముత్యమా’... క్లాసిక్స్. రాజన్ నాగేంద్రలు ఎస్. జానకితో చాలా పాటలు పాడించారు. ‘అబ్బో నేరేడు పళ్లు’, ‘కాస్తందుకో దరఖాస్తందుకో’... ఎంతో మధురంగా ఉంటాయి. కానీ ఎస్. జానకిని తెలుగువారికి నిజంగా పరిచయం చేసింది ఇళయరాజానే. ‘భద్రకాళి’తో తెలుగులో రంగప్రవేశం చేసిన ఇళయరాజా స్ట్రయిట్, డబ్బింగ్ చిత్రాల్లో జానకి చేత పాడించి, ఆమె విశ్వరూపం చూపించారు. ‘ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది’, ‘మౌనమేలనోయి’, ‘ఏవేవో కలలు కన్నాను’, ‘అరె ఏమైంది ఒక మనసుకు’, ‘ఓం నమశ్శివాయ’... లెక్కేలేదు. ఇళయరాజా కచ్చేరీలో చెప్పారు – ‘వెన్నెల్లో గోదారి అందం’... తనకు అంటే రాజాకు కావలసిన పిచ్లో పాడటానికి జానకి పంతం పట్టి 14 టేకులు తీసుకుందట. అంతకు ముందు రెండు గంటల పాటు ఆమె ఆ పాటను సాధన చేసింది. తర్వాత 14 సార్లు పాడింది. ‘గొప్పగా పాడటం ఎలాగూ ఉండేదే. ఏకకాలంలో అన్ని గంటలు ఆ స్థాయిలో పాడే శక్తిఎక్కడిదా!’ అని చకితుడయ్యారా వేయి తపస్సుల రుషి. ‘గోవులు తెల్లన గోపయ్య నల్లన’... పాటలో ఆమె చిన్నపాపలా పాడింది. ఒక తమిళ డబ్బింగ్ కోసం అబ్బాయి గొంతులో ‘పాప పేరు మల్లి... మా ఊరు కొత్త ఢిల్లీ’ పాడింది. ‘శ్రీవారి శోభనం’ సినిమాలో ‘అలక పానుపు ఎక్కనేల’ పాటలో పండు ముదుసలిలా గొంతును ఒణికించింది. ఏది పాడినా భావం హృదయాన్ని తాకుతుంది. ఇళయరాజా సంగీతంలో ‘భావనలొకటై’ పాటలో బాలూ పాడుతుంటే పాటంతా హమ్ చేస్తుంది జానకి. ఇవాళ్టికీ అలా మరొకరు చేయలేరు.బాలూ జానకిలది అద్భుతమైన గాత్రద్వయం. వాళ్ల డ్యూయెట్స్కు ఫాన్ ్స జాస్తి. ‘ఏమని నే చెలి పాడుదును’, ‘ఉరకలై గోదావరి’, ‘నిరంతరమూ వసంతములే’, ‘మాట రాని మౌనమిది’, ‘ఎదలో తొలి వలపే’, ‘నీ చేతులలో తలవాల్చి’, ‘రాశాను ప్రేమలేఖలెన్నో’... ఒకటా రెండా... గూడూరు పాటల పోటీలో ‘పాల కడలిపై శేషతల్పమున’ పాడిన నూనూగు మీసాల బాలూకు ప్రైజ్ ఇచ్చి ‘పనికొస్తావ్’ అని ఆశీర్వదించింది జానకమ్మే. 2013లో కేంద్ర ప్రభుత్వం జానకమ్మకు ‘పద్మభూషణ్’ ప్రకటించింది. కానీ ఆ సమయానికే ఆమె ఆరు దశాబ్దాల పాటు సంగీత సేవ చేసి అలసిపోయి ఉన్నారు. ‘దక్షిణాది కళాకారులకు ఢిల్లీ గుర్తింపు ఎప్పుడూ ఆలస్యంగానే వస్తుంది. నా దేశ ప్రజల ప్రేమే నాకు అతి పెద్ద అవార్డు, నా అర్హతకు ‘భారతరత్న’ ఇవ్వాలి కానీ ఇది కాదు’ అని ఆ పురస్కారాన్ని సున్నితంగా, అంతే ఆత్మాభిమానంతో తిరస్కరించి సంచలనం సృష్టించింది. 2016లో మైసూర్ వేదికగా జరిగిన ఒక ప్రదర్శనలో... ‘నా గొంతు బాగున్నప్పుడే నేను మైక్ వదిలేయాలి, పాడలేక పాడుతోంది అనే మాట నా శ్రోతల నుంచి రాకూడదు’ అని ప్రకటిస్తూ ఆమె హుందాగా ‘సంగీత సన్యాసం’ తీసుకుంది. మధ్యలో ఒకటి రెండు పాడినా అప్పటి నుంచి మైసూర్లోని బోగడిలో ఉన్న తన బంధువుల నివాసంలో ప్రశాంతమైన శేష జీవితాన్ని గడిపింది. వృద్ధాప్య సమస్యలతో మైసూర్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స ΄÷ందుతూ శనివారం సాయంత్రం కన్నుమూసింది. భౌతికంగా జానకమ్మ మన మధ్య లేకపోవచ్చు... కానీ ఆమె పాట అమరమై, శ్రోతలు ఉన్నంత కాలం జీవించే ఉంటుంది. జోహార్లు జానకమ్మ! సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా....‘నాన్ –మలయాళీ’ సంచలనం!ఒక భాషకు చెందని గాయని ఆ భాషలో అత్యధిక అవార్డులు సాధించడం దాదాపు అసాధ్యం. కానీ జానకమ్మ మలయాళంలో సృష్టించిన రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేరు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ గాయని అవార్డును ఆమె ఏకంగా 11సార్లు గెలుచుకున్నారు. కేరళ ప్రజలు ఆమెను ’జానకి అమ్మ’ అని పిలుస్తూ, ఆమె మాతృభాష తెలుగు అంటే నమ్మేవారు కాదు. అంతలా ఆమె మలయాళ ఉచ్చారణను శ్రద్ధతో నేర్చుకుని పాడేవారు.పదేళ్ల క్రితమే జానకి గాయనిగా రిటైర్మెంట్ ప్రకటించారు. మలయాళ చిత్రం ‘పత్తు కల్పనకల్’ (2016)లో ’అమ్మపూవిను’ అనే పాట పాడారామె, ఆ తర్వాత విరామం ప్రకటించారు జానకి. అయితే దర్శక–నిర్మాతల విన్నపం మేరకు తమిళ చిత్రం ‘పన్నాడి’ (2018)లో ‘ఉన్ ఉసురు కాత్తులే’ అనే పాట పాడారు, జానకి కెరీర్లో ఇదే చివరి పాట.సుశీల– జానకిపి. సుశీల, జానకమ్మల మధ్య ఎడం ఉందని కొందరు అనుకుంటారు. కానీ సుశీల జానకిని ఎప్పుడూ మెచ్చుకుంటారు. ‘మెలోడీ పాటలు నేను పాడగలనేమో కానీ... ఒకే పాటలో వంద రకాల ఎక్స్ప్రెషన్స్ జానకికి మాత్రమే సాధ్యం. వాయిస్ మాడ్యులేషన్ విద్యలో జానకి తర్వాతే ఎవరైనా! ఆమెతో నాకు ఎప్పుడూ పోటీ లేదు, ఆమె నా చెల్లెలు’ అని సుశీల ఓపెన్ గా చెప్పారు.అవార్డుల ఫంక్షన్ లో జానకమ్మకు ఒక అవార్డు వచ్చినప్పుడు, స్టేజ్ మీద ఉన్న సుశీల స్వయంగా జానకికి దిష్టి తీసి ఆమె నుదుటిపై ముద్దు పెట్టారు. అప్పట్లో ఈ ఫోటో తమిళ పత్రికల్లో మొదటి పేజీలో వచ్చి సంచలనం సృష్టించింది. సుశీల జానకి పాడిన ‘ఆరనీకుమా ఈ దీపం’ వంటి పాటలెన్నో సూపర్హిట్గా నిలిచాయి.అచ్చం వృద్ధురాలిలానే పాడిన జానకిచిన్న పిల్లల గొంతుతో పాడిన జానకి ఓ సినిమాలో అచ్చం వృద్ధురాలిలానే పాడారు. ఇది ఆమె కెరీర్లో అత్యంత విలక్షణమైన ప్రయోగం అని చెప్పొచ్చు. 1979లో వచ్చిన తమిళ చిత్రం ‘ఉదిరి పూక్కళ్’లో జానకి ‘పోడా పోడా పోక్కే...’ అంటూ వృద్ధురాలిలా పాడారు. ఒక వృద్ధురాలి గొంతుతో పాడి, శ్రోతలను ఆశ్చర్యపరిచారామె. జానకికి ఉన్న అసాధారణ ప్రతిభకు ఈ పాట ఒక నిలువెత్తు నిదర్శనం.ఖదీర్ -
రాకెన్ రోల్ క్వీన్ ఇకలేరు
న్యూయార్క్: తన పాట, ఆటతో 1960లు, 70ల్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రాకెన్ రోల్ క్వీన్, పాప్ సింగర్ టీనా టర్నర్ ఇక లేరు. సుదీర్ఘ అనారోగ్యం బారిన పడ్డ 83 ఏళ్ల టీనా జ్యూరిచ్ సమీపంలోని తన నివాసంలో మంగళవారం కన్నుమూశారు. మిక్ జాగర్ మొదలుకుని బేయాన్స్ దాకా రాక్ స్టార్లంతా టీనా వీరాభిమానులేనంటే ఆమె స్థాయి ఎంతటితో అర్థం చేసుకోవచ్చు! ఎత్తుపల్లాలమయంగా సాగిన ఆమె జీవితం ఆద్యంతం ఆసక్తికరం. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తనను పూర్తిగా గుల్ల చేసిన 20 ఏళ్ల వైవాహిక బంధం తాలూకు దెబ్బను అధిగమించి మరీ పాప్ సంగీత ప్రపంచంలో మకుటం లేని మహారాణి స్థాయిని అందుకున్నారామె. ఏకంగా 12 గ్రామీ అవార్డులు ఆమెను వచ్చి వరించాయి. ఆమె ఆల్బంలు ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లకు పైగా అమ్ముడవడమూ ఓ రికార్డే. టీనా స్ఫూర్తిమంతమైన జీవితం ‘వాట్స్ లవ్ గాట్ టు డూ వితిట్’ పేరిట 1993లో సినిమాగా వచ్చింది. భరించలేని బాధనంతా తనలోనే దాచుకుని ప్రపంచాన్ని మెరుగ్గా తీర్చిదిద్దేందుకు దాన్నే శక్తిమంతమైన ఆయుధంగా మలచుకున్న అంతటి మహనీయ వ్యక్తికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని అందులో టీనా పాత్ర పోషించిన నటి ఏంఎలా బాసెట్ అన్నారు. -
ఎల్విస్ ప్రెస్లీ కూతురు లీసా మేరీ మృతి
లాస్ఏంజెలెస్: లెజెండరీ గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ ఏకైక కూతురు లీసా మేరీ ప్రెస్లీ(54) గురువారం చనిపోయారు. అస్వస్థతకు గురైన తన కూతురు లాస్ఏంజెలెస్లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారని ఆమె తల్లి నటి, ప్రిసిల్లా ప్రెస్లీ వెల్లడించారు. తండ్రి రూపురేఖలు, గళంతో వృత్తిపరంగా ఆయన అడుగుజాడల్లోనే నడిచిన లీసా మేరీ..2000 సంవత్సరాల్లో తన సొంత రాక్ ఆల్బమ్లను విడుదల చేశారు. ఇన్ ది ఘెట్టో, డోన్ట్ క్రై డాడీ వంటి రికార్డుల్లో తండ్రి ఎల్విస్తోపాటు ఆమె పాడారు. మైకేల్ జాక్సన్, నికొలస్ కేజ్లతోపాటు నలుగురిని పెళ్లాడి, కొంతకాలానికే విడిపోయారు. ఈమెకు నలుగురు సంతానం కలిగారు. -
కిషోర్ కుమార్ 'బంగ్లా'లో రెస్టారెంట్ ప్రారంభించనున్న కోహ్లి!
ఆసియా కప్ 2022లో బిజీగా ఉన్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి త్వరలోనే రెస్టారెంట్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ముంబై ప్రాంతంలో బాలీవుడ్ లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్కు చెందిన బంగ్లాలో ఈ రెస్టారెంట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. కిషోర్ కుమార్కు చెందిన బంగ్లాలోని 'గౌరీ కుంజ్' పోర్షన్ను విరుష్క దంపతులు ఐదేళ్ల పాటు లీజుకు తీసుకోనున్నారు. కాగా విరాట్ కోహ్లి తన జెర్సీ నెంబర్ 18ను వన్8 కమ్యూన్ పేరిట తన స్వస్థలం ఢిల్లీతో పాటు కోల్కతా, పుణేలో రెస్ట్రోబార్స్ ఏర్పాటు చేశాడు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో.. ''జుహు, ముంబై.. కమింగ్ సూన్'' అంటూ హ్యాష్ట్యాగ్ జత చేశాడు. రెస్టారెంట్ ఏర్పాటుకు సంబంధించి లీజు, ఇతర పనులను కోహ్లి లీగల్ అథారిటీ సెల్ దగ్గరుండి పర్యవేక్షించనుంది. కోహ్లి ప్రారంభించబోయే రెస్టారెంట్పై త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది. స్వతహగా వ్యాపార రంగంపై ఆసక్తి కనబరిచే కోహ్లి.. 'వన్8' బ్రాండ్ పేరిట ఇప్పటికే క్లాత్, షూస్, హాస్పిటాలిటీ రంగాలలో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు కూడా అందుకుంటున్నాడు. ఇటీవలే ''వ్రాంగ్'' బ్రాండెడ్ కంపెనీకి చెందిన ''క్లోతింగ్ అండ్ యాక్ససరీస్లకు'' సంబంధించిన పలు బ్రాండ్లలో కోహ్లి ఇన్వెస్ట్ చేశాడు. కిషోర్ కుమార్ బంగ్లాలో రెస్టారెంట్ ప్రారంభించాలన్న కోహ్లి ఆలోచనను కొంతమంది ప్రసంశించారు. ఇప్పటికే ఈ బంగ్లాకు ''ఐకానిక్ బంగ్లా'' అని పేరు ఉంది. దిగ్గజం కిషోర్ కుమార్ ఇక్కడున్న చెట్లకు పలు పేర్లు పెట్టినట్లు ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆయన వాడిన వింటేజ్ కార్లు, వస్తువులు ఇక్కడి మ్యూజియంలో పెట్టారు. కాగా కిషోర్ కుమార్ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు అమిత్ కుమార్ తన కుటుంబంతో కలిసి ఇదే బంగ్లాలో నివసిస్తుండడం విశేషం. ఇక ప్రస్తుతం ఆసియాకప్లో బిజీగా ఉన్న కోహ్లి టీమిండియా తరపున మంచి ప్రదర్శనే కనబరుస్తున్నాడు. సెంచరీ చేయకపోయినా పాకిస్తాన్, హాంకాంగ్లతో జరిగిన మ్యాచ్ల్లో కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. పాక్తో మ్యాచ్లో 35 పరుగులు చేసి ఔటైన కోహ్లి.. హాంకాంగ్తో మ్యాచ్లో 59 పరుగులు నాటౌట్గా నిలిచాడు. చదవండి: IND Vs AFG: టీమిండియాతో అఫ్గానిస్తాన్ మ్యాచ్.. కళ్లన్నీ ఆ యువతిపైనే! -
బప్పి లహరి అంత్యక్రియలు వాయిదా.. కారణమిదే
లెజెండరీ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి మృతిపై బాలీవుడ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 27, 1952న పశ్చిమ బెంగాల్లో జన్మించిన బప్పి లహిరి అన్ని భాషల్లో కలిపి 5వేలకు పైగా పాటలు పాడారు. సంగీతానికి వెస్టర్న్ మ్యూజిక్ మిక్స్ చేసి మైమరపించిన సంగీత దిగ్గజం బప్పి లహరి అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలు రేపు(గురువారం)నిర్వహించనున్నారు. చదవండి: మరణానికి ముందు.. బప్పి షేర్ చేసిన చివరి పోస్ట్ ఇదే బప్పి లహరి కుమారుడు బప్పా లహరి ప్రస్తుతం లాస్ ఏంజిల్స్లో ఉంటున్నారు. తండ్రి మరణవార్త తెలిసి హుటాహుటిన భారత్కు బయలుదేరారు. ఈ నేపథ్యంలో కుమారుడు వచ్చాకే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో రేపు ముంబైలో బప్పి లహరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చదవండి: బప్పి లహరికి బంగారం అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా? -
కన్నీరు పెట్టిస్తున్న లతా మంగేష్కర్ ఓల్డ్ వీడియో..
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణవార్తను ఆమె అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. లతా జీ మృతితో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కొన్నివేల పాటలతో సంగీత ప్రియులను మైమరిపించిన లతా జీ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబైలోని శివాజీ పార్కులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా గత రెండు రోజులుగా లతా మంగేష్కర్కు సంబంధించిన పలు కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లతా జీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న లతా మంగేష్కర్ ఓ ఇంటర్వ్యూలో.. మళ్లీ జన్మంటూ ఉంటే లతా మంగేష్కర్గా పుట్ట కూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే లతా మంగేష్కర్ జీవితంలో ఎన్ని కష్టాలున్నాయన్నది ఆమెకు మాత్రమే తెలుసు అంటూ లతాజీ చెప్పిన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. చదవండి: లతా మంగేష్కర్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? View this post on Instagram A post shared by Gaurav Ogale (@patranimacchi) -
గగన కచేరికి గాన కోకిల
ముంబై: గాన కోకిల, సుమధుర గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఇక లేరు. 140 కోట్ల మంది భారతీయులనే గాక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను శోకసముద్రంలో ముం చుతూ గంధర్వ లోకానికి మరలిపోయారు. దాదాపు 80 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు అందరినీ అలరించి, మైమరపించిన ఆమె మధుర గాత్రం శాశ్వతంగా మూగవోయింది. చిన్నా పెద్దా అందరికీ లతా దీదీగా సుపరిచితురాలైన ఈ మెలొడీ క్వీన్ 92 ఏళ్ల వయసులో ఆదివారం ముంబైలో కరోనాతో కన్నుమూశారు. జనవరిలోనే స్వల్ప కరోనా లక్షణాలు కన్పించడంతో బ్రీచ్క్యాండీ ఆస్పత్రిలో చేరిన లత, తర్వాత నిమోనియాతో కూడా బాధపడ్డారు. ఆదివారం ముంబైలో లతా మంగేష్కర్ పార్ధివదేహం వద్ద నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ లత కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో ఆశా భోంస్లే, శ్రద్ధా కపూర్ తదితరులు శనివారం ఉదయానికి పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. చివరికి కీలక అవయవాల వైఫల్యంతో ఆదివారం ఉదయం 8.12 గంటలకు తుదిశ్వాస విడిచారు. రాష్ట్రపతి మొదలుకుని ప్రముఖులంతా లత మృతి పట్ల ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. కేంద్రం దేశవ్యాప్తంగా రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. అధికారిక కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేశారు. రెండు రోజులూ త్రివర్ణ పతాకాన్ని సగం మేర అవనతం చేసి ఉంచుతారు. పార్లమెంటు సోమవారం లతకు నివాళులు అర్పించనుంది. అనంతరం ఆమె గౌరవార్థం ఉభయ సభలను గంటపాటు వాయిదా వేస్తారు. తల్లడిల్లిన దేశం లత మరణ వార్త విని దేశమంతా తల్లడిల్లిపోయింది. ఉదయాన్నే ఆమె పాటలతోనే లేచి, వాటిని వింటూనే రాత్రి నిద్రలోకి జారుకునే కోట్లాది మంది అభిమానులు ఈ దుర్వార్తను జీర్ణించుకోలేకపోయారు. కడసారి చూపు కోసం ముంబై పొద్దార్ రోడ్డులోని లత నివాసం ‘ప్రభు కుంజ్’ముందు బారులు తీరారు. అక్కడి నుంచి శివాజీ పార్కు దాకా 10 కిలోమీటర్ల పొడవునా సాగిన అంతిమయాత్రకు అశేషంగా తరలివచ్చారు. అశ్రు నయనాలతో ఆమె పార్థివ దేహంతో పాటు సాగారు. లతా దీదీ అమర్ రహే అంటూ నినదించారు. చెట్లు, బిల్డింగుల పైకెక్కి అంతిమయాత్రను వీక్షించారు. లత అంత్యక్రియలకు కుమార్తెతో వచ్చిన అమితాబ్ కోట్లాది మంది టీవీల్లో చూస్తూ విలపించారు. సైనిక, పోలీసు దళాలు సెల్యూట్ చేస్తూ ముందు సాగుతుండగా లత సోదరి, ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లేతో పాటు తోబుట్టువులంతా పార్థివ దేహంతో పాటు వాహనంలో వెళ్లారు. శివాజీ పార్కు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకుని బాలీవుడ్ తదితర సినీ, క్రీడా ప్రముఖులంతా త్రివర్ణ పతాకంలో చుట్టిన లత భౌతిక కాయాన్ని సందర్శించారు. పుష్పగుచ్ఛాలుంచి ఘనంగా కడసారి నివాళులర్పించారు. కుటుంబీకులను మోదీ ఓదార్చి వెనుదిరిగారు. అనంతరం పూర్తి ప్రభుత్వ లాంఛనాల మధ్య జరిగిన అంత్యక్రియల్లో బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, క్రికెట్ దిగ్గజం సచిన్ తదితర ప్రముఖులెందరో బాధాతప్త హృదయాలతో పాల్గొన్నారు. సోదరుడు హృదయనాథ్ లత చితికి నిప్పంటించారు. తిరుగులేని కెరీర్ లత 1929 సెప్టెంబర్ 28న ఇండోర్లో జన్మించారు. ఐదేళ్ల వయసులోనే సంగీత సాధన మొదలు పెట్టడంతో స్కూలు చదువు అంతగా సాగలేదు. 1942లో 13వ ఏట కితీ హసాల్ అనే మరాఠీ చిత్రంలో పాడటం ద్వారా గాయనిగా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. అనితరసాధ్యమైన కంఠ మాధుర్యంతో దేశదేశాల అభిమానులను ఉర్రూతలూగించారు. ‘ప్యార్ కియా తో డర్నా క్యా’, ‘సత్యం శివం సుందరం’, ‘పానీ పానీ రే’... ఇలా చెప్పుకుంటూ పోతే లత సుమధుర గళం నుంచి జాలువారిన అజరామరమైన పాటల జాబితాకు అంతే ఉండదు. 80 ఏళ్ల అద్భుత కెరీర్లో హిందీలోనే గాక తెలుగు, తమిళ్, కన్నడతో పాటు ఏకంగా 36 భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడి అలరించారు. 2012 అక్టోబర్లో చివరి పాట పాడారు లత. దేశ చరిత్రలో అత్యుత్తమ ప్లేబ్యాకర్ సింగర్గా నిలిచిన ఆమెను వరించిన అవార్డులకు లెక్కే లేదు. పలు ఫిల్మ్ఫేర్లు, నేషనల్ ఫిల్మ్ అవార్డులతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్, పద్మవిభూషణ్, 2001లో భారతరత్న అందుకున్నారు. ఆమె అవివాహితగానే మిగిలిపోయారు. దిగ్గజ గాయకులు, సంగీత దర్శ కులు, నటీనటులెందరో లతను అమితంగా అభి మానించేవారు. అపర సరస్వతిగా కీర్తించేవారు కూ డా. ఈ పొగడ్తను, ఆప్యాయతలను ఆమె వినమ్రం గానే స్వీకరించేవారు. ‘‘అంతా నా తల్లిదండ్రులు, ఆ భగవంతుని ఆశీర్వాదం’’ అని గత అక్టోబర్లో తన చివరి ఇంటర్వ్యూలో చెప్పారామె. రాయల్ హాల్లో ప్రదర్శన ఇచ్చిన తొలి భారత ఆర్టిస్టు లండన్లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో 1974లో లత సంగీత విభావరి నిర్వహించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఆర్టిస్టుగా రికార్డు సృష్టించారు. ఆమెకు అదే తొలి అంతర్జాతీయ ప్రదర్శన కూడా. ‘‘ఇన్హీ లోగోం నే’, ‘ఆజా రే పర్దేశీ’, ‘ఆయేగా ఆనేవాలా’అంటూ లత లైవ్లో పాడిన బాలీవుడ్ ఆపాత మధురాలు వినేందుకు అభిమానులంతా విరగబడ్డారు. దాంతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. ‘పూల సుగంధానికి రంగు లేదు. పారే నీటికి హద్దుల్లేవు. సూర్య కిరణాలకు మత భేదాల్లేవు. లతా మంగేష్కర్ గళానికి ఎల్లల్లేవు. పరిమితులు అసలే లేవు’అంటూ ఆమె గురించి బాలీవుడ్ దిగ్గజం దిలీప్కుమార్ ఉర్దూలో కవితాత్మక పరిచయ వాక్యాలతో అలరించారు. ఈ షో తాలూకు ఎల్పీ రికార్డింగులు రెండు వాల్యూమ్లుగా విడుదలై అప్పట్లో రికార్డు స్థాయిలో 1.33 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. లతాజీ మరణం కలచివేసింది లతా మంగేష్కర్ మరణించారన్న వార్త నన్ను ఎంతగానో కలచివేసింది. నాతోపాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భౌతికంగా జీవించి లేకపోయినా ఆమె పాడిన పాటలకు మాత్రం మరణం లేదు. భారతరత్న లతా మంగేష్కర్ సాధించిన విజయాలు అసామాన్యం. భావి తరాలకు ఆమె ఒక స్ఫూర్తి ప్రదాత. ఒక గాయనిగానే కాకుండా గొప్ప మానవతావాదిగా లతాజీ గుర్తుండిపోతారు. కొన్ని శతాబ్దాల కాలంలో ఆమెలాంటి వారు ఒక్కరే జన్మిస్తారు. – రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అద్భుత స్వరం దూరమైంది లతా మంగేష్కర్ మరణం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి చెందా. లతాజీ మృతితో భారతదేశానికి అద్భుత స్వరం దూరమయ్యింది. ఆమె కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను అలరించారు. – ఎం.వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి భారతీయ సంస్కృతికి ప్రతీక గానకోకిల లతాజీని రాబోయే తరాలు భారతీయ సంస్కృతికి ప్రతీకగా స్మరించుకుంటాయి. ఆమె నాపై కురిపించిన ఆప్యాయతను గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఆమెతో మాట్లాడిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను. దశాబ్దాలుగా భారతీయ సినిమా పరిణామ క్రమానికి ప్రత్యక్ష సాక్షి లతా దీదీ. కేవలం సినిమాలే కాదు, దేశాభివృద్ధిని సైతం కాంక్షించారు. భారత్ను బలమైన, అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని ఎల్లప్పుడూ కోరుకునేవారు. లతా దీదీతో చక్కటి బాంధవ్యం ఉండేదని నాలాంటి ఎంతోమంది మున్ముందు గర్వంగా చెప్పుకుంటారు. భౌతికంగా ఆమె మనమధ్య లేకపోయినా పాటల రూపంలో ఎప్పటికీ మనతోనే ఉంటారు. మధురమైన ఆమె గాత్రం మనతో ఉండిపోతుంది. – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లతాజీ సేవలను వర్ణించలేం కేవలం భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో లతా మంగేష్కర్ అభిమానులు ఉన్నారు. ఆమె తన స్వరంతో అందరినీ అలరించారు. సంగీత ప్రపంచానికి లతాజీ చేసిన సేవలను మాటల్లో వర్ణించడం అసాధ్యం. ఆ మె మరణం వ్యక్తిగతంగా నాకు తీరని నష్టం కలిగించింది. ఎన్నోసార్లు ఆమె నుంచి ఆశీస్సులు అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. – కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశం గొప్ప బిడ్డను కోల్పోయింది భారత గానకోకిల లతా మంగేష్కర్. భారత్ తన గొప్ప బిడ్డను కోల్పోయింది. ఆమె మరణంతో దేశానికి పూడ్చలేని నష్టం వాటిల్లింది. లతాజీ స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యం. ఆమె తన పాటల ద్వారా దేశంలో సాంస్కృతిక వికాసానికి ఎనలేని సేవ చేశారు. లతా మంగేష్కర్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. – మన్మోహన్ సింగ్, మాజీ ప్రధానమంత్రి ఆ స్వరానికి మరణం లేదు లతా మంగేష్కర్ అమృత స్వరం అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆ స్వరానికి మరణం లేదు. ఆమె మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. లతాజీ మృతితో భారతీయ కళా ప్రపంచానికి ఎంతో నష్టం వాటిల్లింది. – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఒక శకం ముగిసింది లతా మంగేష్కర్ మరణంతో భారతీయ సంగీతంలో ఒక శకం ముగిసింది. ఆ స్వరకోకిల గాత్రం ప్రపంచమంతటా ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆ స్వర మాధుర్యం అభిమానులెవరూ మర్చిపోలేనిది. – అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి నమ్మలేకపోతున్నాం.. లతా మంగేష్కర్ అద్భుతమైన గాత్ర మాధుర్యంతో భారతీయులందరి హృదయాలను కదిలించారు. భారత గానకోకిల ఇక లేరన్న విషయం నమ్మలేకపోతున్నాం. ఆమె మరణాన్ని తలచుకొంటే మనసు బరువెక్కుతోంది. దశాబ్దాలపాటు వివిధ భాషల్లో వేలాది పాటలు పాడి ప్రజలను అలరించడం సాధారణ విషయం కాదు. – ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి పాటలు విని పరవశించా.. లతాజీ గొంతు నుంచి జాలువారిన మధురమైన పాటలు విని పరవశించిపోయా. బెంగాల్తోపాటు ఈశాన్య ప్రాంతాల కళాకారులను ఆమె అభిమానించేవారు. ఆమె తన కళాప్రపంచంలో బెంగాల్కు స్థానం కల్పించారు. కోట్లాది మంది లాగే నేను కూడా లతాజీకి పెద్ద అభిమానిని. ఆమె మన నుంచి దూరం కావడం దురదృష్టకరం. – మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్ సీఎం -
లతా మంగేష్కర్ కడసారి వీడ్కోలు.. బారీగా వచ్చిన అభిమానులు
-
గగన కోకిల - లతా మంగేష్కర్
-
మీరెక్కడ ఉన్న.. మా కోవెలే..మా ఇంటి కోకిలే
-
లతా మంగేష్కర్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లు? తొలి రెమ్యునరేషన్ ఎంతంటే..
Lata Mangeshkar Total Net Worth: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లతాజీ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్నివేల పాటలతో సంగీత ప్రియులను మైమరిపించిన ఆమె 92ఏళ్ల వయసులో కన్నుమూసింది. అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఐదేళ్ల ప్రాయంలోనే గాయనిగా ప్రస్థానం ప్రారంభించిన లతా మంగేష్కర్ అతి తక్కువ కాలంలోనే విశేష గుర్తింపు సంపాదించుకున్నారు. హిందీ, మరాఠీ, తెలుగు సహా వివిధ భాషల్లో సుమారు 50వేల పైచిలుకు పైగా పాటలు పాడి శ్రోతలను విశేషంగా అలరించారు. అలా సుధీర్ఘమైన కెరీర్లో ఎన్నో వేల పాటలు పాడిన లతాజీ రెమ్యునరేషన్ కూడా అత్యధికంగానే తీసుకునేవారు. 1950ల కాలంలో ఒక్కో పాటకు సుమారు 500రూపాయల పారితోషికాన్ని అందుకునేవారట. అప్పట్లో ఆశా భోస్లే సహా పేరున్న సింగర్స్కి సైతం 150 రూపాయలు ఇచ్చేవారట. కానీ ఆ సమయంలో కూడా లతాజీకి అందరికంటే అత్యధికంటే రెమ్యునరేషన్ ఇచ్చేవారని స్వయంగా ఆశా భోస్లే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మొదట్లో 25 రూపాయలతో ప్రారంభమైన లతా జీ సంపాదన. ఇప్పుడు వంద కోట్లకు పైగా చేరుకుంది. ఆమెకు ముంబై సహా పలు కొన్ని నగరాల్లో విలసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు ఉన్నాయి. అలా చనిపోయే నాటికి లతా మంగేష్కర్ ఆస్తుల విలువ సుమారు రూ. 200 కోట్లకు పైగానే ఉందని సమాచారం. -
లతా మంగేష్కర్కు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
-
ఆ స్టార్ హీరోతో లతాజీకి వాగ్వాదం.. అయినా సరే నో చెప్పింది
When Lata Mangeshkar Refused To Sing Raj Kapoor Song: లతా మంగేష్కర్ లెగసీ గురించి వర్ణించడానికి పదాలు చాలవు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సంగీత సరస్వతి ఆవిడ. చిన్న వయసులోనే స్టార్ సింగర్గా ఫేమ్ తెచ్చుకున్నారు. తండ్రి మరణంతో తప్పనిసరై పాటలు పాడేందుకు చిత్ర పరిశ్రమలోకి రావాల్సి వచ్చిన లతాజీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలిచారు. లతా మంగేష్కర్ తొలిసారి ఓ మరాఠీ చిత్రంతో నేపథ్య గాయనిగా మారారు. అయితే ఎడిటింగ్లో ఆ పాటను తీసేశారు. కానీ ఆ తర్వాత ఆమె ప్రస్థానం ఊహించని రీతిలో మలుపు తిరిగింది. 'అజీబ్ దస్తాన్ హై యే', 'ప్యార్ కియా తో డర్నా క్యా', 'నీలా అస్మాన్ సో గయా', 'తేరే లియే' వంటి అనేక గీతాలకు ఆమె గాత్రంతో ప్రాణం పోశారు. అసలు ఆమె కాల్షిట్ల కోసం సంగీత దర్శకులు పోటీ పడేవారంటే ఆమె స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా తన కట్టుబాట్లు, సాంప్రదాయాలకు ఎంతో విలువిచ్చే లతాజీ సినిమాల్లో ద్వందర్థాలు వచ్చే పాటలు పాడేందుకు ససేమీరా నిరాకరించేవారు. అలా ఆమె పాడనని మొండికేయడంతో ఎన్నో పాటల లిరిక్స్ని సైతం మార్చాల్సి వచ్చింది. 1964లో సంగం సినిమా కోసం 'మై కా కరూ రామ్ ముఝే బుడ్డా మిల్ గాయా' పాట విషయంలో ప్రముఖ హీరో రాజ్కపూర్తో గంటన్నరకు పైగా లతాజీకి వాగ్వాదం జరిగింది. పాటలో సాహిత్యం బాగుందని ఎంతగా నచ్చజెప్పినా లతాజీ మాత్రం వినలేదట. దీంతో ఆ పాటను వేరే వాళ్లతో పాడించారట. అనూహ్యంగా ఆ పాట సూపర్హిట్గా నిలిచింది. కానీ ఇంతవరకు ఆ పాటను కానీ, ఆ సినిమాను కానీ చూడలేదని లతాజీ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. చదవండి: లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటో తెలుసా? -
కోకిలమ్మ- లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ జర్నీ
-
ముంబై శివాజీ పార్కుకు లతా మంగేష్కర్ పార్థివదేహం తరలింపు
-
లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటో తెలుసా?
Why Lata Mangeshkar Never Got Married Here Is The Reason: భారత సినీ సంగీత ప్రపంచంలో ఓ శిఖరం నేలకొరిగింది. దిగ్గజ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. లతా జీ మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కోట్లాది అభిమానుల సంగీత దేవతగా ఆమె ఆరాధించబడిన లతా మంగేష్కర్ జీవితం ఎంతో స్పూర్తిదాయకం. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన ఆమె కీర్తి ఎనలేనిది. అయితే ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. ఈ లెజెండరీ సింగర్ ఎందుకు పెళ్లి చేసుకోలేదనే ప్రశ్న అభిమానుల్లో మిగిలిపోయింది. దీనిపై ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లతాజీ సమాధానమిచ్చింది. 'జీవితంలో ప్రతిదీ దేవుడి నిర్ణయం ఆధారంగానే జరుగుతుంది. ఏం జరిగినా అది మన మంచి కోసమే అనుకోవాలి. పెళ్లి వద్దనుకునే ఆడపిల్లలు కూడా ఉంటారా? అనే ఈ ప్రశ్న ఓ నలభై ఏళ్ల క్రితం అడిగి ఉంటే నా సమాధానం మరోలా ఉండేదేమో. ఈ వయసులో అలాంటి ఆలోచలకు తావు లేదు.. అంటూ ఆమె సమాధానం చెప్పారు. ఈ ఇంటర్వ్యూ నాటికి లతాజీ వయసు 82 సంవత్సరాలు. అంతేకాకుండా పెళ్లిపై లతాజీ చేసిన మరొక కామెంట్ ఏంటంటే.. కుటుంబంలో పెద్ద అమ్మాయిని కావడం తండ్రి చనిపోయాక 13ఏళ్ల వయసు నుంచే కుటుంబ బాధ్యతని భుజాన వేసుకున్నాను. ఓ దశలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పటికీ ఈ కారణంగా కుదరలేదు' అని వివరించారు. -
నైటింగేల్ ఆఫ్ ఇండియా లతాజీ అస్తమయం
-
మీకు తెలుసా? లతా మంగేష్కర్పై గతంలో విష ప్రయోగం జరిగింది!
ఆమె గొంతెత్తి పాడితే సినీ ప్రియులు పులకరించిపోయారు. గాన మాధుర్యానికి మంత్రముగ్ధులయ్యారు. ఎందుకంటే ఆమె గొంతులో అమృతం ఉంది. దానికి అన్ని రకాల ఎమోషన్స్ను పండించగల సామర్థ్యం ఉంది. ఆ కోకిల స్వరం నుంచి జాలువారిన పాటలు వేలల్లోనే ఉన్నా తెలుగులో మాత్రం మూడంటే మూడు పాటలే పాడింది. ఇప్పుడేకంగా ఏ పాట పాడనంటూ శాశ్వతంగా మూగబోయింది. ఆదివారం ఉదయం లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆమె మృతిపై పలువురు సెలబ్రిటీలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గతంలో ఆమెపై విషప్రయోగం జరిగిన విషయాన్ని సైతం ప్రస్తావిస్తున్నారు. 1963లో లతా మంగేష్కర్పై విషప్రయోగం జరిగింది. దీంతో ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడింది. వాంతులు కూడా చేసుకుంది. కాళ్లు సైతం కదపడానికి వీల్లేక నొప్పితో విలవిల్లాడుతూ మూడురోజుల పాటు మంచానికే పరిమితమైంది. ఆమెను పరీక్షించిన డాక్టర్.. ఎవరో ఆమెకు స్లోపాయిజన్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని లతాజీకి సన్నిహితంగా మెలిగే ప్రముఖ రచయిత్రి పద్మా సచ్దేవ్ ఓ పుస్తకంలో వెల్లడించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన లతా మంగేష్కర్ తర్వాత కోలుకున్నారు కానీ ఈ విషప్రయోగంతో చాలా నీరసపడిపోయారని అందులో పేర్కొన్నారు. చాలా రోజుల పాటు ఆమె మంచంపైనే ఉండిపోయారట. ఆ సమయంలో గేయ రచయిత సుల్తాన్ పురీ ప్రతిరోజు సాయంత్రం ఆమె ఇంటికి వచ్చి సరదాగా కథలు, కవితలు, జోక్స్ చెప్పి ఆమెను నవ్వించేవారని, ఆమె తినే ప్రతి వంటనూ ముందు ఆయన తిని చెక్ చేసేవారట. ఇలా కొన్నాళ్లపాటు ఆమె వెన్నంటే ఉంటూ ఆమె కోలుకునేందుకు సుల్తాన్పురీ ఎంతగానో సాయపడినట్లు తెలుస్తోంది. -
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూత
-
ఇండియన్ నైటింగేల్ సినీ ప్రస్థానం.. ఆమె ఫేవరెట్ సింగర్ ఎవరంటే ?
Nightingale of India Lata Mangeshkar reign of cinema: ప్రముఖ నేపథ్య గాయని, బారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ కన్ను మూశారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో నాలుగు వారాలుగా కరోనా చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు మెరుగైన చికిత్స చేసినప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు. అప్పుడే కోలుకొని అప్పుడే విజృంభించిన కరోనాతో పోరాడుతూ ఆదివారం (ఫిబ్రవరి 6) తుది శ్వాస విడిచారు. 13 ఏళ్లకే కేరీర్ ఆరంభం.. ఇండియన్ నైటింగేల్గా పేరొందిన లతా మంగేష్కర్ తన 13 సంవత్సరాల వయసులో 1942లో కెరీర్ను ప్రారంభించారు. సుమారు 20 భాషల్లో కలిపి మొత్తం 50 వేలకు పైగా పాటలు పాడిన ఘటికురాలు. ఆమె 7 దశాబ్దాల గాయనీ ప్రయాణంలో మరపురాని పాటలను ఆలపించారు. అందులో 'అజీబ్ దస్తాన్ హై యే', 'ప్యార్ కియా తో డర్నా క్యా', 'నీలా అస్మాన్ సో గయా', 'తేరే లియే' వంటి అనేక గీతాలకు ఆమె గాత్రంతో ప్రాణం పోశారు. 'పద్మ భూషణ్', 'పద్మ విభూషణ్', 'దాదా సాహెబ్ ఫాల్కే', 'బహుళ జాతీయ చలనచిత్ర' అవార్డులతో సహా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' అవార్డును పొందారు లతా మంగేష్కర్. ఐదేళ్లకే సంగీత శిక్షణ.. లతా మంగేష్కర్ సెప్టెంబర్ 28, 1929న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించారు. 1942లో తన కళా ప్రయాణాన్ని ప్రారంభించి.. సుమారు 980 సినిమాల్లో పాటలు పాడి తన గానంతో అలరించారు. గాయనీగా కాకుండా నటిగా కూడా చేశారు లతా మంగేష్కర్. హిందీ సినిమా పాటల గాయనీ అంటే ముందుగా గుర్తు వచ్చేది లతా మంగేష్కర్ పేరే. హిందీ సినీ పరిశ్రమపై అంతలా తనదైన ముద్ర వేశారు. లతా మంగేష్కర్ సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్కు పెద్ద కుమార్తెగా (ఐదుగురిలో) జన్మించారు. ఆమె తర్వాత వరుసగా ఆశా భోంస్లే, హృదయనాథ్, ఉషా, మీనా ఉన్నారు. ఐదో ఏటనే తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించారు లతా మంగేష్కర్, సంగీతాన్ని వినడం, పాడటం తప్ప మరొక ప్రపంచం లేదు. తాను చదువుకోకపోయినా తన చెల్లెళ్లు మాత్రం పెద్ద చదువులు చదువుకోవాలనుకున్నారు లతా మంగేష్కర్. కానీ వారు కూడా సంగీతంపైనే ఎక్కువ ఆసక్తి చూపడంతో కుటుంబమంతా సంగీతంలోనే స్థిరపడిపోయింది. పెద్ద కుమార్తెగా కుటుంబ పోషణ బాధ్యత లతా మంగేష్కర్కు 13 ఏళ్ల వయసులో తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ఆర్థిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించాడు. దీంతో కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. అందుకే సినీ రంగంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. 1942లో మరాఠీ చిత్రం 'పహ్లా మంగళ గౌర్'లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడారు. తర్వాత చిముక్లా సుసార్ (1943), గజెభావు (1944), జీవన్ యాత్ర (1946), మందిర్ 1948) తదితర చిత్రాల్లో లతా మంగేష్కర్ నటించారు. ఆ కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్, సురైయాలు గాయనీలుగా వెలుగుతున్నారు. అయితే లతా మంగేష్కర్కు నచ్చిన గాయకుడు కె. ఎల్. సైగల్ అని తెలిపారు. -
శాస్త్రీయ సంగీత దిగ్గజం కన్నుమూత
న్యూయార్క్ : ప్రముఖ శాస్త్రీయ సంగీత విధ్వాంసులు పండిట్ జస్రాజ్ (90) సోమవారం కన్నుమూశారు. వయోభారంతో అమెరికన్ నగరం న్యూయార్క్లో జస్రాజ్ తుదిశ్వాస విడిచారు. ఆయన తన సుదీర్ఘ కెరీర్లో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. జస్రాజ్ హర్యానాలోని హిస్సార్లో 1930 జనవరి 28న జన్మించారు. తన తండ్రి పండిట్ మోతీరామ్ తన తొలి గురువు కావడంతో జస్రాజ్ ఏటా ఆయన జ్ఞాపకార్ధం హైదరాబాద్లో గత 30 ఏళ్లుగా పండిట్ మోతీరామ్ సంగీత్ సమారోహ్ను నిర్వహిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ గాయని సాధనా సర్గమ్తో పాటు సంజీవ్ అభయంకర్, సుమన్ ఘోష్, తృప్తి ముఖర్జీ, కళా రామ్నాథ్ల వంటి ఎందరినో ఆయన గాయకులుగా తీర్చిదిద్దారు. భారత సంగీత దిగ్గజం ఇక లేరని ఆయన కుమార్తె దుర్గా జస్రాజ్ ప్రకటించారు. కాగా, పండిట్ జస్రాజ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చదవండి : ప్రముఖ సీనియర్ గాయని మృతి -
'ఇదే నా చివరి పాట'
లెజెండరీ సింగర్ ఎస్ జానకీ తన రిటైర్మెంట్ను ప్రకటించారు. దాదాపు 60 సంవత్సరాలుగా 48 వేలకు పైగా పాటలతో సినీ సంగీత అభిమానులను అలరిస్తున్న జానకీ వయో భారం కారణంగా గాయనిగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా తెలియజేశారు. చివరగా అమ్మాపోవిను అనే మలయాళ పాటను రికార్డ్ చేసిన జానకీ, ఇకపై పాటలు పాడదలుచుకోలేదని, సినిమాలతో పాటు వేదిక మీద కూడా పాడేది లేదంటూ ప్రకటించారు. సుదీర్ఘ సంగీత ప్రయాణంలో దాదాపు భారతీయ భాషలన్నింటిలో పాడిన జానకీ, 4 జాతీయ అవార్డులతో పాటు 32 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు. అయితే ఆమె రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో పలు మీడియా సంస్థలు జానకి మరణించినట్టు ప్రచారం చేయటంపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారని, కేవలం గాయనిగా కొనసాగటం లేదని మాత్రమే తెలిపారు.


