టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. కాగా సెప్టెంబర్ 11న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. కానీ ఇప్పుడీ ప్రాజెక్ట్ వాయిదా పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 30న విడుదల?
‘రణబాలి’ని అక్టోబర్ 30న విడుదల చేయాలని చిత్రబృందం ఆలోచిస్తుందట. ఇటీవల రష్మికకు గాయం కావడమే దీనికి కారణం! ప్రస్తుతం ఆమె కోలుకున్నారని త్వరలోనే షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. అయితే ఈ విడుదల తేదీపై చిత్ర బృందం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
‘రణబాలి’లో విజయ్ 19వ శతాబ్దానికి చెందిన ఓ తిరుగుబాటుదారుడుగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. బ్రిటిష్ సైనికుడిని గుర్రంపై లాక్కెళ్తున్న సన్నివేశం సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. రష్మిక జయమ్మ పాత్రలో కనువిందు చేయనుంది.
రష్మికకు గాయం..
రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రష్మిక చేస్తున్న యాక్షన్ సినిమా ‘మైసా’. ఇందులో గోండు తెగకు చెందిన మహిళగా రష్మిక కనిపించనుంది. ఇటీవల ఓ పాట షూటింగ్ చేస్తుండగా ఈమె నడుముకు బలమైన గాయమైంది. దీంతో వైద్యులు ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.


