బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముంబై విమానాశ్రయంలో ఆయన యువ నటి కోమల్ రాణి స్వర్ణకర్తో కలిసి కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో గతంలో గోవిందా భార్య సునీత ఆహూజా చేసిన వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇంతకీ ఆ ‘కోమల్’ ఎవరు? సునీత గతంలో ఎందుకు ఆమె పేరు ప్రస్తావించారో తెలుసుకుందాం..!
గోవిందా, కోమల్ రాణి మధ్య గత నాలుగేళ్లుగా సంబంధం ఉందంటూ గతంలో కొన్ని వార్తలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఉత్తరాఖండ్లో జరిగిన ఓ కార్యక్రమానికి వీరిద్దరూ కలిసి హాజరైనట్లు కూడా కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ ప్రచారంపై గోవిందా కానీ, కోమల్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
గతంలో సునీత ఏం చెప్పారు?
గోవిందా వివాహేతర సంబంధాలపై గతంలో జరిగిన చర్చ సందర్భంగా సునీత ఆహూజా ఓ ఇంటర్వ్యూలో ‘కోమల్’ అనే పేరును ప్రస్తావించారు. ఓ ఇంటర్వ్యూలో కోమల్ పేరు గురించి ప్రశ్నించగా.. ఆ విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉందని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. గోవిందా విషయంలో ఎప్పుడైనా వివాహేతర సంబంధానికి సంబంధించిన ఆధారాలు తనకు లభిస్తే మాత్రం క్షమించబోనని సునీత స్పష్టం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరు కలిసి కనిపించడంతో సునీత అప్పట్లో ప్రస్తావించిన ‘కోమల్’ ఈమెనేనా? వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
ఎవరీ కోమల్ రాణి స్వర్ణకర్?
ఉత్తరప్రదేశ్కు చెందిన కోమల్ రాణి స్వర్ణకర్ త్వరలో ‘రూపా’ అనే చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.


