
జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ ఉంటుందని ప్రకటన వచ్చిన తర్వాత చిత్రపరిశ్రమలో సంచలనంగా మారింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ఎంట్రీతో చిత్ర పరిశ్రమ ఆ నిర్ణయాన్ని సడలించుకుంది. తాజాగా ఇదే అంశంపై నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి పలు వ్యాఖ్యలు చేశారు.
మల్టీఫ్లెక్స్ మాదిరే సింగిల్ థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని ఆయన కోరారు. అయితే, కొందరు అసలు విషయాన్ని దాటేసి ఇదంతా 'హరి హర వీరమల్లు' సినిమాకు నష్టం చేసేందుకు కుట్ర అంటూ తెరపైకి తీసుకురావడం చాలా దుర్మార్గం అని పేర్కొన్నారు. సింగిల్ థియేటర్స్ మనుగడ కోసమే వారు బంద్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఇలా అన్నారు. 'నేను చాలా ఏళ్ల క్రితమే సింగిల్ థియేటర్లకు కూడా పర్సంటేజీ సిస్టమ్ ఉండాలని, లీజ్ సిస్టమ్ వద్దని కోరాను. చాలామంది నిర్మాతలు కూడా ఇదే కోరుకుంటున్నారు. పర్సంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. కానీ, హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్దం. పర్సంటేజీలు ఖరారైతే నా లాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుంది. పవన్ కల్యాణ్పై ఎవరు కుట్ర చేస్తారు..? పవన్ కార్యాలయం నుంచి ఆ ప్రకటన రావడం సమంజసంగా లేదు. హరిహర వీరమల్లు కోసం కాకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం.. రావాలని పిలిస్తే పవన్పై గౌరవం మరింత పెరిగేది. పర్సంటేజీ సిస్టమ్ అన్ని థియేటర్స్కు లేకపోవడం వల్ల నిర్మాతలు అందరూ నాశనం అయిపోతున్నారు. సింగిల్ థియేటర్స్ మూత పడుతున్నాయి. మల్టీఫ్లెక్స్ల మాదిరే వాటికి కూడా ఇదే పద్ధతి ఉండాలి. దీని కోసం మేము చాలా ఏళ్లపాటు పెద్ద ఉద్యమం చేశాం. థియేటర్స్ 'లీజ్ సిస్టమ్' వల్ల తీరని నష్టం జరుగుతుంది. దీనిని అందరూ గుర్తించాలి.
'బంద్ అనేది బ్రహ్మాస్తం లాంటిది. సింగిల్ థియేటర్ల మనుగడ నేడు ప్రశ్నార్థకరమైంది. భారతదేశంలో సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి దొరికే వినోదం. పర్సంటేజి విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒక్కణ్ణి. ఈ విషయంలో ఛాంబర్ ముందు టెంటు వేసి ఆందోళనలు చేశాం. ఎంతో మంది ఛాంబర్ ప్రెసిడెంట్లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు. పర్సంటేజి విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో హరిహర వీరమల్లుకు లింకు పెట్టడం సరికాదు. పరిశ్రమ పెద్దలు సీఎం చంద్రబాబును కలువాలని అనడంలో తప్పులేదు. మేం మీ బిడ్డలం. ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి పర్సంటేజి అంశాన్ని పక్కదారి పట్టించవద్దు. కార్పొరేట్ సిస్టమ్లకు వంతపాడుతున్నారు. మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమైపోవాలి.

సింగిల్ థియేటర్లు దేవాలయాల లాంటివి. కానీ, నేడు సింగిల్ థియేటర్లు కళ్యాణ మండపాలవుతున్నాయి. పర్సంటేజిని బతికించి నిర్మాతలను కాపాడాలి. ఇదే జరిగితే ప్రేక్షకులు ఓటీటీలలోనే సినిమాలు చూస్తారు. ఆ పొరపాటు జరిగితే ఇండస్ట్రీ నాశనమవుతుంది. పవన్ సినిమా రిలీజ్ అవుతుందటే థియేటర్స్ బంద్ చేయడం చాలా దుర్మార్గం అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆయన మాటలు చాలా తప్పు. ఈ పోరాటం ఇప్పటిది కాదు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి.' అని నారాయణమూర్తి అన్నారు.