
పెళ్లైన దంపతులను నిండునూరేళ్లు కలిసి జీవించమని పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. కానీ, ఈ కాలంలో నూరేళ్లు బతకడం కష్టమే అయితే, అంతవరకు కలిసి జీవించడం పెద్ద సవాల్గా మారింది. ఎన్నో జంటలు ఆడంబరంగా వివాహం చేసుకోవడం తర్వాత విడాకులు తీసుకోవడం పరిపాటిగా మారింది. సినీ ఇండస్ట్రీలో ఈ ధోరణి కాస్త ఎక్కువే కనిపిస్తుంది.
నిందలు- బాధలు
అయితే విడాకులు తీసుకోవడం ఈజీ అయినా, ఆ బాధను మర్చిపోవడం అంత తేలిక కాదంటున్నాడు హీరో ప్రోసెంజిత్ చటర్జీ (Prosenjit Chatterjee). ఇతడు సహనటి దెబశ్రీ రాయ్ (Debashree Roy)ను పెళ్లాడాడు. వివాహమైన కొంతకాలానికే విడిపోయారు. ఈ విషయం గురించి ప్రొసెంజిత్ తాజాగా టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అప్పుడు మా వయసు పెద్దదేం కాదు. విడిపోయినప్పుడు ఒకరినొకరు నిందించుకున్నాం.
టాప్ 10 నటుల్లో నేను లేను
కానీ ఆ బాధ నుంచి బయటపడలేకపోయాను. పనిపై దృష్టి సారించలేకపోయాను. కొంత డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. సరిగ్గా అదే సమయంలో బెంగాల్లో టాప్ 10 నటుల గురించి ఓ వార్త రాశారు. టాప్ 10 జాబితాలో ఎక్కడా నా పేరు లేదు. అది నన్ను మరింత బాధలోకి నెట్టేసింది. నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. తిరిగి ఆఫీస్కు వెళ్లి ఒకేసారి తొమ్మిది సినిమాలు సంతకం చేశాను. ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే ఒరిగేదేం లేదు.

ప్రొసెంజిత్ చటర్జీ- దెబశ్రీ రాయ్
మూడు పెళ్లిళ్లు
బాధగా అనిపించినప్పుడల్లా నా తోటకి వెళ్లేవాడిని. ఎవరితోనూ మాట్లాడకుండా కాసేపు ప్రశాంతంగా కూర్చునేవాడిని అని చెప్పుకొచ్చాడు. దెబశ్రీకి విడాకులు ఇచ్చాక ప్రొసెంజిత్ మరోసారి ప్రేమలో పడ్డాడు. అపర్ణ గుహ తకుర్తను పెళ్లాడాడు. వీరికి ప్రేరణ అనే కూతురు పుట్టింది. తర్వాత ఈ జంట మధ్య కూడా విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. నటి అర్పితా పాల్ను మూడో పెళ్లి చేసుకున్నాడు.
కెరీర్
బాలీవుడ్ నటుడు బిస్వజిత్ చటర్జీ కుమారుడే ప్రొసెంజిత్. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన ప్రొసెంజిత్ హీరోగా, విలన్గా అనేక సినిమాలు చేశాడు. బెంగాలీ, హిందీలో అనేక చిత్రాల్లో నటించాడు. దోసర్ మూవీకి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. చివరగా ఖాకీ: ద బెంగాల్ చాప్టర్ అనే వెబ్ సిరీస్లో కనిపించాడు. ప్రస్తుతం మాలిక్ అనే మూవీ చేస్తున్నాడు. పులకిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రాజ్ కుమార్ రావు, మానుషి చిల్లరి, మేధా శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ జూలై 11న విడుదల కానుంది.