తెలుగు రియాలిటీ షోల్లో బిగ్బాస్ ఒకటి. ఇప్పటివరకు 9 సీజన్లు జరగ్గా 7వ సీజన్ విజేతగా రైతుబిడ్డ అలియాస్ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే తను గెలుచుకున్న డబ్బుని రైతులకు పంచుతానని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చాడు. తీరా చూస్తే అలాంటిదేం చేయలేదు. అసలు ఏమైంది అని లేటెస్ట్ ఇంటర్వ్యూలో అడిగితే షో నిర్వహకులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రైజ్మనీ, కారు, నెక్లెస్ అని చెప్పి తనని మోసం చేశారని చెప్పుకొచ్చాడు. సంచలన విషయాలని పంచుకున్నాడు.
(ఇదీ చదవండి: అగ్నిపరీక్షలో రైతుబిడ్డ.. సింగర్ మాత్రమే కాదు అంతకుమించి)
'నేను గెలుచుకున్న ప్రైజ్మనీ నా దగ్గరకు రావడానికి టైమ్ పట్టింది. కొందరు తెలియక నన్ను తిడుతూనే ఉన్నారు. దీంతో అసలు వీళ్లకు ఏం తెలుసు అని నేను బాధపడ్డా. కొన్నిరోజుల తర్వాత డబ్బు వచ్చింది. రూ.35 లక్షల్లో 40 శాతం జీఎస్టీ కట్ అయింది. కారు గిఫ్ట్ అని చెప్పారు కానీ అక్కడికి వెళ్లగానే రూ.8.5 లక్షలు కట్ చేశారు. డబ్బులిస్తేనే తీస్కో లేదంటే ఇది ఇక్కడే ఉంటదని అన్నారు. మరి కారుకి డబ్బులు ఎందులో నుంచి ఇవ్వాలి? నెక్లెస్ విషయానికొస్తే టీమ్ గిఫ్ట్ అన్నారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత రూ.5 లక్షల కట్టాలని చెప్పారు. గిఫ్ట్ ట్యాక్స్ ఇలానే ఉంటుందన్నారు. ఏందన్నా ఇదంతా అని అడిగితే.. రూల్స్ రూల్సే అని చెప్పారు' అని పల్లవి ప్రశాంత్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.
పల్లవి ప్రశాంత్ పాల్గొన్న ఏడో సీజన్ ప్రైజ్మనీ మొత్తం రూ.50 లక్షలు.. కానీ ఇదే సీజన్లో ఫైనల్ వరకు వచ్చిన ప్రిన్స్ యావర్, సూట్ కేసు తీసుకుని స్వచ్ఛందంగా బయటకొచ్చేశాడు. అందులో రూ.15 లక్షలు ఉన్నాయి. ఈ మొత్తం పోగా ప్రశాంత్ రూ.35 లక్షలు గెలుచుకున్నాడు. ఇందులో 40శాతం జీఎస్టీ కటింగ్ అంటే రూ.14 లక్షలు, కారుకి రూ.8.5 లక్షలు, నెక్లెస్కి రూ.5 లక్షలు తీసేస్తే ఇక మిగిలింది రూ.7.5 లక్షలు మాత్రమే వచ్చిందన్నట్లు ప్రశాంత్ చెబుతున్నాడు. కానీ ఇతడు చెబుతున్నది నిజమా అబద్ధమా అనేది అర్థం కావట్లేదు. బిగ్బాస్ యాజమాన్యం వైపునుంచి ఈ విషయంపై క్లారిటీ రావాలి.
ఇకపోతే పల్లవి ప్రశాంత్ గతంలో శివ అనే యూట్యూబర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి భిన్నమైన కామెంట్స్ చేశాడు. 'డబ్బులిస్తానని ఇవ్వకుండా తినేశాడని అందరూ అంటున్నారు. నేను చేసిన సాయం ఎంతో ఏంటో ఇచ్చిన నాకు తెలుసు. తీసుకున్న వాళ్లకు తెలుసు. బిగ్బాస్ ద్వారా వచ్చిన డబ్బే కాదు జీవితాంతం నేను సంపాదించిన దాంట్లో కొంత సాయం చేయాలని అనుకున్నా, చేస్తున్నా. నా దయ వల్ల ఓ చెల్లి కాలేజీ ఫస్ట్ వచ్చానని నాకు ఫోన్ చేసింది. వాళ్లు ముందుకు వచ్చి అన్న సాయం చేశాడని చెప్పడానికి ఇష్టపడటం లేదు. అందుకే అవన్నీ బయటపెట్టలేకపోతున్నా. వాళ్లు చదువుకోవడం నాకు ముఖ్యం. ఆ చెల్లి వీడియో ముందుకొచ్చి చెప్పను అని అన్నది కానీ అవసరం అయితే వస్తానంది. అలా చాలామంది ఉన్నారు. నేను చేస్తానన్న సాయం చేసేశాను ఇంకా చేస్తూనే ఉంటాను తప్ప లెక్కలు అడిగితే చెప్పలేను' అని గతంలో చెప్పాడు. మరి ఈ రెండింటిలో ఏదో నిజమో పల్లవి ప్రశాంతే చెప్పాలి.
(ఇదీ చదవండి: 'బిగ్బాస్' మొదలవకముందే నెగిటివిటీ.. జడ్జిలనే తిడుతూ వీడియోలు)


