
ఈ రోజుల్లో డబ్బు ఎలా సంపాదించాలన్న దానికన్నా ఎలాగోలా సొంతం చేసుకోవాలన్న ఆశే ఎక్కువవుతోంది. ఇందుకోసం అడ్డదారులు తొక్కేవారు కొందరైతే అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకునేవాళ్లు మరికొందరు. ఈ డబ్బు కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. డబ్బు మనిషి ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుంది? డబ్బు కోసం మనిషి ఎంతదూరం వెళ్తాడన్న అంశంపై తెరకెక్కిన సిరీస్ స్క్విడ్ గేమ్.
ప్రాణాంతక గేమ్
ఈ సిరీస్ ప్రపంచాన్నే ఓ ఊపు ఊపేసింది. గేమ్లో గెలిస్తే చాలు.. కలలో కూడా ఊహించలేనంత డబ్బు మీ సొంతం అనడంతో వందలాది మంది గేమ్ ఆడేందుకు వెళ్తారు. తీరా అక్కడికి వెళ్లాక గేమ్లో ఓడినవారి ప్రాణాలు తీస్తారు. తమ గెలుపు కోసం కొందరు ప్లేయర్స్ పక్కవారి ప్రాణాలు తీయడానికీ వెనకాడరు. చివరకు ఒకే ఒక్కరు విజేతగా నిలిచి డబ్బు గెలుచుకుంటారు. అలా ప్లేయర్ 456 ఓసారి గేమ్లో గెలిచి కోట్లాది ధనం పొందుతాడు.
కోట్లు గెలిచినా దక్కని సంతోషం
కానీ అందరి చావులను కళ్లారా చూసిన అతడికి ఆ విజయం సంతోషాన్నివ్వకపోగా మరింత బాధపడతాడు. అమాయకుల ప్రాణాలు బలితీసుకుంటున్న ఈ ఆటకు ఎలాగైనా ముగింపు పలకాలని మరోసారి గేమ్లో అడుగుపెడతాడు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుండగా రెండో సీజన్ ముగుస్తుంది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మూడో సీజన్ వచ్చేస్తోంది. జూన్ 27న నెట్ఫ్లిక్స్లో ఈ ఫైనల్ సీజన్ ప్రసారం కానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఆటకు ముగింపు?
ఫస్ట్ సీజన్లో రెడ్ లైట్- గ్రీన్ లైట్ అని గేమ్ ఆడించిన ఓ బొమ్మను మరోసారి ఈ సీజన్లో ప్రవేశపెట్టారు. ఈ సారి గేమ్ మరింత క్రూరంగా ఉండనున్నట్లు కనిపిస్తోంది. ప్లేయర్ 456.. పాశవికమైన ఆట ఆడిస్తున్న వ్యక్తిని నేరుగా కలిసినట్లు చూపించారు. మరి అతడు ఈ ఆటను ఆపగలిగాడా? లేదా? అనేది తెలియాలంటే ఈ నెలాఖరులో స్క్విడ్ గేమ్ చివరి సీజన్ చూసేయాల్సిందే!
చదవండి: కుమారుడి కోసం కలిసొచ్చిన ధనుష్-ఐశ్వర్య.. రజనీ ఏమన్నారంటే?