
'కన్నప్ప' సినిమా ప్రమోషన్లలో బిజిబిజీగా ఉన్న మంచు విష్ణు.. మీడియాలో తెగ కనిపిస్తున్నాడు. కొన్నిరోజుల నుంచి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా గురించి, తన గురించి చాలా విషయాలు చెబుతున్నాడు. మూవీ రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం కొచ్చిలో ఈవెంట్ చేశారు. మోహన్ లాల్ చేతుల మీదుగా 'కన్నప్ప' ట్రైలర్ని లాంచ్ చేశారు. తర్వాత అక్కడి మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మలయాళ చిత్రసీమ గురించి కొన్ని విషయాలు మాట్లాడారు.
'మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి లెజెండ్స్ సినిమాలను ఎప్పుడూ మిస్ అవ్వను. 'ట్రాన్స్' సినిమాలో ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ నాకు ఎంతగానే నచ్చేసింది. గతేడాది రిలీజై భారీ హిట్ కొట్టిన ఫహాద్ ఫాజిల్ 'ఆవేశం' కూడా చాలా బాగుంటుంది. దీన్ని తెలుగులోనే నేను రీమేక్ చేయాలనుకున్నా. కానీ అప్పటికే ఎవరో హక్కులు తీసేసుకోవడంతో ఇక సైలెంట్ అయిపోయాను' అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఇతడు 'ఆవేశం' చేసుంటే ఎలా ఉండేదో?
(ఇదీ చదవండి: సేతుపతి కోసం హిట్ బ్యూటీని పట్టేసిన పూరీ జగన్నాథ్)
చాన్నాళ్లుగా సరైన సినిమాలు చేయక పూర్తిగా వెనకబడిపోయిన మంచు విష్ణు.. లాంగ్ గ్యాప్ తీసుకుని చేసిన సినిమా మూవీ 'కన్నప్ప'. ఇందులో విష్ణు హీరోగా నటిస్తూనే, నిర్మాతగా భారీ బడ్జెట్ పెట్టాడు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితర స్టార్స్ని ఒప్పించి ఈ చిత్రంలో అతిథి పాత్రలు పోషించేలా చేశాడు. వీళ్లతో పాటు మోహన్ బాబు, కాజల్, శరత్ కుమార్.. ఇలా చాలామంది ప్రముఖ నటీనటులు ఇందులో నటించారు. చూస్తుంటే విష్ణు 'కన్నప్ప' చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మరి ఈ మూవీ ఎలాంటి ఫలితం తీసుకొస్తుందో చూడాలి?
'ఆవేశం' విషయానికొస్తే.. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ ఓ గ్యాంగ్స్టర్గా నటించాడు. డిఫరెంట్ ఎమోషన్స్తో సరికొత్తగా కనిపించి ఆకట్టుకున్నాడు. అమెజాన్ ప్రైమ్లో మలయాళ, తమిళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. లెక్క ప్రకారం తెలుగు కూడా ఉండాలి. కానీ రీమేక్ హక్కులు.. మన దగ్గర ఓ నిర్మాత తీసుకోవడంతో తెలుగు డబ్బింగ్ చేయలేదు. తెలుగులో ఈ సినిమాని బాలకృష్ణతో చేయాలని అనుకుంటున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ ఇంతవరకు దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం)