
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 సెట్లో ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ సినిమా సెట్లో ప్రమాదం చోటు చేసుకుందని.. 30 మంది కళాకారులతో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయిందని మీడియాలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ క్లారిటీ ఇచ్చింది. తాజాగా హోంబలే ఫిల్మ్స్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఆదర్శ్ ఈ అంశంపై మాట్లాడారు.
ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 షూటింగ్ కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద జరుగుతోంది. ఈ సినిమా సెట్లో ప్రమాదం చోటు చేసుకుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. చిత్రీకరణలో భాగంగా జలాశయం వద్ద తాము సెట్ వేశామని.. అయితే వీపరీతమైన గాలి వీయడంతో అది పాడైపోయిందని వెల్లడించారు. ఈ ఘటన జరిగినప్పుడు సెట్లో నటీనటులు కానీ.. సిబ్బంది లేరన్నారు. ఈ రోజు యథావిధిగా షూటింగ్ జరుగుతున్నట్లు వెల్లడించారు. షూటింగ్ జరిగే ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. గజ ఈతగాళ్లు, స్కూబా డైవర్స్ సమక్షంలోనే మూవీ షూట్ చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రకటనలో ఉదయం నుంచి వస్తున్న రూమర్స్కు నిర్మాణ సంస్థ చెక్ పెట్టేసింది.
(ఇది చదవండి: 'కాంతార'ని వెంటాడుతున్న శాపం? ఈసారి ఏకంగా హీరో)
కాగా.. 2022లో సూపర్ హిట్గా నిలిచిన కాంతార మూవీకి ప్రీక్వెల్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హీరో రిషభ్ శెట్టి దర్శకత్వంలోనే తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.