
కథానాయకుడిగా, నిర్మాతగా చిత్రాలు చేస్తున్న నటుడు కమలహాసన్. ఈయన ఇటీవల తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై శివకార్తికేయన్ కథానాయకుడిగా నిర్మించిన చిత్రం అమరన్. నటి సాయిపల్లవి నాయకిగా రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కాగా తాజాగా కమలహాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో మెడ్రాస్ టాకీస్తో కలిసి రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన థగ్లైఫ్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. తదుపరి కమలహాసన్ ప్రముఖ స్టంట్ మాస్టర్స్ అన్బరివ్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించి, ఓ చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నాయి.
కాగా తాజాగా కమలహాసన్ మరో చిత్రం నిర్మించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. ఈయన ఇంతకు ముందు సిద్ధార్థ్ హీరోగా చిత్తా, విక్రమ్ కథానాయకుడిగా వీర ధీర శూరన్ వంటి సక్సెస్పుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. కాగా ఈ క్రేజీ చిత్రంలో నటించే హీరో ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రచారంలో ఉన్నా, చివరికి నటుడు సూర్య ఈ చిత్రంలో హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సూర్యతో నిర్మించనున్న ఈ సినిమా కోసం కమల్ భారీ బడ్జెట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.
సూర్య ఇంతకు ముందు కమలహాసన్ కథానాయకుడిగా నటించి నిర్మించిన విక్రమ్ చిత్రంలో రోలెక్స్ అనే పాత్రలో అతిథిగా మెరిసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా సూర్య హీరోగా అరుణ్కుమార్ దర్శకత్వంలో నటించనున్న చిత్రం గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. కాగా ప్రస్తుతం సూర్య తన 45వ చిత్రం షూటింగ్ను పూర్తి చేసే పనిలో ఉంటూనే తన 46వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.