
∙అవార్డు జ్యూరీ చైర్మన్ మురళీమోహన్, ఎఫ్డీసీ చైర్మన్ ‘దిల్’ రాజుతో జ్యూరీ సభ్యులు
‘‘రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదేళ్లుగా అవార్డులు ఇవ్వడం మానేశాయి. ప్రభుత్వం నుంచి ఒక అవార్డు రావాలి, ఆ అవార్డుని ఇంట్లో పెట్టుకోవాలని ఆశిస్తాం. అంతేకానీ డబ్బుల గురించి కాదు... అవార్డు లనేవి గౌరవం ఇస్తాయి’’ అని నటుడు, నిర్మాత మురళీమోహన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించనున్న ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్(Gaddar Telangana Film Awards) (2014–2023)కి సంబంధించి జ్యూరీ చైర్మన్గా మురళీమోహన్ వ్యవహరించారు. జూన్ 14న హైదరాబాద్లోని హైటెక్స్లో ఈ అవార్డుల వేడుక జరగనుంది.
ఈ అవార్డుల వివరాలను ప్రకటించేందుకు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత ‘దిల్’ రాజుతో కలిసి శుక్రవారం హైదరాబాద్లోని ఎఫ్డీసీ కార్యాలయంలో మురళీమోహన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ప్రతి ఏటా అవార్డులు ఇవ్వాలని ఈ పదేళ్లల్లో ముఖ్యమంత్రులందర్నీ కలిసి విన్నవించాం. అప్పుడు అందరూ ఇద్దాం, చేద్దాం అన్నారు కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిగారు ఓ స్ఫూర్తితో ప్రజాగాయకుడు గద్దర్గారి పేరిట ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’ని ప్రకటించడం సంతోషం. ఈ కమిటీకి ‘దిల్’ రాజుగారు నన్ను చైర్మన్ని చేశారు.
మా జ్యూరీలో అందరూ అనుభవం ఉన్నవారిని, సినిమాకి సంబంధం ఉన్న వ్యక్తులనే నియమించారు. అందరం కలిసి చర్చించుకుని ఏకాభిప్రాయంతోనే అవార్డులు ఎంపిక చేశాం. గురువారం సాయంత్రం ఈ అవార్డుల జాబితాను రేవంత్ రెడ్డిగారికి సమర్పించాం. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నాం. ఈ అవార్డుల ప్రదానానికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డిగారికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున ధన్యవాదాలు.
తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలి
అవార్డుల ప్రదానం విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని, ఒక అవగాహనకు రావాలి. ఒక్కో ఏడాది ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను ప్రకటిస్తే బాగుంటుంది. ఒకే తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగుండదు. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలి. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ కాదు’’ అని పేర్కొన్నారు.
తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘2014 నుంచి 2023 వరకు ప్రతి ఏడాది మూడు అవార్డుల చొప్పున (తొలి ఉత్తమ చిత్రం, ద్వితీయ ఉత్తమ చిత్రం, తృతీయ ఉత్తమ చిత్రం) ఈ పదేళ్లకు సంబంధించిన సినిమాలను జ్యూరీ చైర్మన్ మురళీమోహన్గారి ఆధ్వర్యంలోని జ్యూరీ ఎంపిక చేసింది. అలాగే ఆరు ప్రత్యేక అవార్డులు ఇవ్వనున్నాం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నంది అవార్డుల్లో ఉన్న నాలుగు ప్రత్యేక అవార్డు (రఘుపతి వెంకయ్య, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి–చక్రపాణి, ఎన్టీఆర్ జాతీయ అవార్డులు) లతోపాటు అదనంగా తెలంగాణకి చెందిన పైడి జైరాజ్, కాంతారావు పేర్లతోనూ అవార్డులను ఇవ్వనున్నాం. జూన్ 14న 2024కి సంబంధించిన ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’తోపాటు ఈ పదేళ్లకి సంబంధించిన అవార్డులను కలుపుకుని మొత్తం 11 ఏళ్లకి సంబంధించి అదే రోజు ప్రదానం చేస్తాం’’ అని తెలిపారు.
ఈ సమావేశంలో జ్యూరీ సభ్యులు
కె. దశరథ్, డీవీకే రాజు, ఊహ, ఉమామహేశ్వర రావు, వనజా ఉదయ్, కూచిపూడి వెంకట్, కె. శ్రీధర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ డా. హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
అవార్డుకి ఎంపికైన చిత్రాలు
2014
1. రన్ రాజా రన్ 2.పాఠశాల 3. అల్లుడు శీను
2015
1. రుద్రమదేవి 2. కంచె 3. శ్రీమంతుడు
2016
1. శతమానం భవతి 2. పెళ్ళి చూపులు 3. జనతా గ్యారేజ్
2017
1. బాహుబలి 2, 2. ఫిదా 3. ఘాజీ
2018
1. మహానటి 2. రంగస్థలం 3. కేరాఫ్ కంచరపాలెం
2019
1. మహర్షి 2. జెర్సీ 3. మల్లేశం
2020
1. అల వైకుంఠపురములో.. 2. కలర్ ఫోటో 3. మిడిల్ క్లాస్ మెలోడీస్
2021
1. ఆర్ఆర్ఆర్ 2. అఖండ 3. ఉప్పెన
2022
1. సీతారామం 2. కార్తికేయ 2 3. మేజర్
2023
1. బలగం 2. హనుమాన్ 3. భగవంత్ కేసరి
స్పెషల్ జ్యూరీ అవార్డు: ప్రజాకవి కాళోజీ
ప్రత్యేక అవార్డులు...
ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు: నందమూరి బాలకృష్ణ (హీరో)
పైడి జైరాజ్ ఆల్ ఇండియా ఫిల్మ్ అవార్డు: మణిరత్నం (డైరెక్టర్)
బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు: సుకుమార్ (డైరెక్టర్)
నాగిరెడ్డి–చక్రపాణి ఫిల్మ్ అవార్డు: అట్లూరి పూర్ణచంద్రరావు (నిర్మాత)
కాంతారావు ఫిల్మ్ అవార్డు: విజయ్ దేవరకొండ (హీరో)
రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు: యండమూరి వీరేంద్రనాథ్ (రచయిత)
⇒ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన ఘడియలు ఒక వైపు... ఎన్టీఆర్ నట ప్రస్థాన 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు... నటుడిగా నేను 50 ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకోవైపు... కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్తో సత్కరించిన ఇలాంటి తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘ఎన్టీఆర్ జాతీయ అవార్డు’ని నాకు ప్రకటించడం నా అదృష్టంగా, దైవ నిర్ణయంగా, నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, జ్యూరీ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రజల దీవెనలు, నాన్నగారి చల్లని కృప, భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్లవేళలా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. – హీరో బాలకృష్ణ
⇒ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్లో ‘శ్రీమంతుడు, మహర్షి, మేజర్’ సినిమాలకు అవార్డులు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నా దర్శకులకు, ఈ అవార్డులకు కారణమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సినిమాను సెలబ్రేట్ చేసే ప్రతిష్ఠాత్మకమైన గౌరవ పురస్కారాలను ఇన్షియేట్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.
– హీరో మహేశ్బాబు
⇒ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో నట ప్రపూర్ణ కాంతారావు ఫిల్మ్ అవార్డుకు నేను ఎంపిక అవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డుని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నాపై నమ్మకంతో ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు. అదే విధంగా 2016కి సంబంధించి రెండో ఉత్తమ సినిమాగా ‘పెళ్ళి చూపులు’ ఎంపికవడంపై సంతోషంగా ఉన్నాను. ఈ చిత్రానికి నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ విజయం నా అభిమానులకు చెందుతుంది. ఎందుకంటే వారి ప్రేమ, అభిమానాలే నన్ను నిరంతరం ముందుకు నడిపిస్తున్నాయి. ఈ ప్రయాణంలో భాగమైన నా దర్శక–నిర్మాతలు, కుటుంబ సభ్యులు, ఇతర చిత్రయూనిట్కి థ్యాంక్స్. – హీరో విజయ్ దేవరకొండ
⇒ 2015వ సంవత్సరానికిగాను మా గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద రాగిణి గుణ, నీలిమ గుణ, యుక్త గుణ నిర్మించిన ‘రుద్రమ దేవి’కి ఉత్తమ చిత్రంగా గద్దర్ సినిమా అవార్డుని ప్రకటించడం ఆనందంగా,ప్రోత్సాహకరంగా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, జ్యూరీ చైర్మన్ మురళీమోహన్గారికి, మిగతా సభ్యులకు కృతజ్ఞతలు. రుద్రమ దేవిగా అనుష్క అద్భుతంగా నటించారు. గోన గన్నారెడ్డిపాత్రలో మెప్పించిన అల్లు అర్జున్ తెర ముందు, తెర వెనక మా చిత్రానికి వెన్నెముకగా నిలిచారు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. – దర్శక–నిర్మాత గుణశేఖర్
⇒ తెలుగు సినిమా మార్గదర్శకులలో బీఎన్ రెడ్డిగారు ఒకరు. ఆయన పేరు మీద అవార్డు అందుకోనుండటం చాలా గౌరవం. నన్నెంతగానో స΄ోర్ట్ చేస్తున్న నా నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవ జ్యూరీకి నా ధన్యవాదాలు. – దర్శకుడు సుకుమార్