
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ సినిమా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్లోని హైటెక్స్ ఈ వేడుకకు వేదికైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాగా.. టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు ఎంతోమంది హాజరయ్యారు. అయితే ప్రత్యేక్ష ఆకర్షణగా అల్లు అర్జున్ నిలిచాడు. బన్నీతో పాటు విజయ్ దేవరకొండ కూడా కనిపించడం విశేషం.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిర్మాత దిల్ రాజు.. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2014 నుంచి 2024 వరకూ గద్దర్ అవార్డులను అందజేశారు. సదరు పురస్కార గ్రహీతలకు సిల్వర్ మెమొంటో, రూ.5 లక్షల ప్రైజ్ మనీతో పాటు ప్రశంసా పత్రం అందించారు. సినీ తారల రాకతో హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారింది. వేల మంది ఈవెంట్కు హాజరయ్యారు.
'గామి' సినిమాకుగాను ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా విశ్వనాథ్ రెడ్డి, ఉత్తమ్ ఆర్ట్ డైరెక్టర్గా అద్నితిన్ జిహానీ చౌదరి.. 'కల్కి 2898ఏడీ' సినిమాకు అవార్డులు అందుకున్నారు. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ నల్ల శ్రీను (రజాకార్), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనా రావు- అజయ్ కుమార్ (కల్కి), ఉత్తమ ఆడియోగ్రాఫర్ అరవింద్ మేనన్ (గామి), ఉత్తమ ఎడిటర్ నవీన్ నూలి (లక్కీ భాస్కర్), ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్, ఉత్తమ స్టోరీ రైటర్ శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి) అవార్డులు అందుకున్నారు.
