
ఫోక్ వీడియో సాంగ్స్ తో డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ అలియాస్ జాను లిరి.. తర్వాత ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2లోనూ పాల్గొని విజేతగా నిలిచింది. రీసెంట్ గా ఆహా ఓటీటీలోనూ డ్యాన్స్ షోలో పాల్గొంది కానీ ఎలిమినేట్ అయిపోయింది. సరే ఇవన్నీ పక్కనబెడితే కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్-ఈమెపై చాలా ట్రోలింగ్ నడిచింది. వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందనేలా చాలా ట్రోల్స్ వచ్చాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి అజిత్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)
కొన్నిరోజుల క్రితం ఈ ట్రోలింగ్ పై స్పందించిన శేఖర్ మాస్టర్.. ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావట్లేదని, జాను లిరితో తనకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు అంటే నిన్న జాను ఓ వీడియో రిలీజ్ చేసింది.
'నన్ను టార్గెట్ చేయడం ఆపండి. నేనేం చేసినా తప్పే అంటున్నారు. ఇన్స్టాలో నా వాయిస్కు గలీజ్ మాటలు యాడ్ చేస్తున్నారు. అవి నా కొడుకు చూడడా? ఎక్కడికైనా వెళ్లి చచ్చిపోవాలనిపిస్తోంది. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే మాత్రం మీరే కారణం. నా వల్ల కావట్లేదు. నా ఓపిక నశించింది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, నవ్వినా, కూర్చున్నా.. ఎందుకు నిందలేస్తున్నారు?' అని బోరున ఏడుస్తూ వీడియో పెట్టింది.
(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే)
ఇప్పుడు తన రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ మరో వీడియో పోస్ట్ చేసింది. 'ఇకపై ట్రోలింగ్ పట్టించుకోను. అవును నేను రెండో పెళ్లి చేసుకుంటాను. అందరికీ సమాధానమిస్తాను. పెళ్లి తర్వాత కూడా నా కొడుకుతో ఎంతో సంతోషంగా ఉంటాను. అంతే తప్ప ట్రోల్స్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్లను. జీవితంలో ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాను' అని చెప్పుకొచ్చింది.
ఈమె పదో తరగతిలో ఉండగానే ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొడుకు కూడా పుట్టాడు. కానీ మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకునేందుకు జాను లిరి సిద్ధమైంది. త్వరలో గుడ్ న్యూస్ చెబుతుంది.
(ఇదీ చదవండి: ‘గిరిజన’ వివాదంపై స్పందించిన విజయ్ దేవరకొండ)