
ఎంత పెద్ద సినిమా అయినా సరే.. కథలో దమ్ముంటేనే జనాలు థియేటర్కు వస్తున్నారు. ఏమాత్రం నచ్చకపోయినా మాకు అక్కర్లేదు అంటూ ఆ దిక్కు కూడా చూడటం లేదు. ఇండియన్ 2, థగ్ లైఫ్ ఫెయిల్యూర్స్ అందుకు పెద్ద ఉదాహరణ.. ఇకపోతే లేటెస్ట్గా కుబేర, 8 వసంతాలు (8 Vasantalu Movie) చిత్రాలు రిలీజయ్యాయి. కుబేర బ్లాక్బస్టర్ టాక్తో దూసుకుపోతోంది. అటు 8 వసంతాలు మూవీకి కూడా కాస్త పాజిటివ్ టాక్ లభించినప్పటికీ కుబేర ముందు తేలిపోయింది.
ఓటీటీలో బాగుంటుంది
ఇలాంటి సమయంలో ప్రేక్షకుల్ని తమ సినిమా వైపు ఎలా తిప్పుకోవాలా? అని చిత్రయూనిట్ ఆలోచించాలి! కానీ దర్శకుడు ఫణీంద్ర సక్సెస్ మీట్కు డుమ్మా కొట్టాడు. మరోవైపు సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి మాత్రం ఎంచక్కా ఓటీటీలో చూసేయమని చెప్తున్నాడు. సక్సెస్ మీట్లో విశ్వనాథ్ మాట్లాడుతూ.. ఇది త్వరలోనే ఓటీటీలోకి వస్తుంది. అది కూడా నెట్ఫ్లిక్స్లో వస్తుంది. థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ కంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ నెట్ఫ్లిక్స్లో ఉండబోతుంది. ఇమేజ్ క్వాలిటీ ఇంకా మెరుగ్గా ఉంటుంది అంటూ తమ సినిమాను ఓటీటీలో చూడమని చెప్పకనే చెప్పాడు. అక్కడున్నవాళ్లు మధ్యలో కలుగజేసుకోవడంతో స్టేజీపైనే సారీ చెప్పాడు.
సినిమా
8 వసంతాలు చిత్రంలో మ్యాడ్ ఫేమ్ అనంతిక సనిల్ కుమార్ కథానాయికగా నటించింది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, సమీరా కిశోర్, కన్నా పసునూరి కీలక పాత్రలు పోషించారు. జూన్ 20న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
“#8Vasantalu Theatre లో Experience కంటే Netflix లో Experience బాగుంటుంది.”
- Cinematographer Vishwanath pic.twitter.com/5LyQOphewO— Movies4u Official (@Movies4u_Officl) June 23, 2025
చదవండి: థగ్ లైఫ్ డిజాస్టర్.. క్షమాపణలు మాత్రమే చెప్పగలను.. మణిరత్నం