నర్సాపూర్‌పై నలుదిక్కుల నజర్‌.. | - | Sakshi
Sakshi News home page

నర్సాపూర్‌పై నలుదిక్కుల నజర్‌..

Aug 10 2023 7:58 AM | Updated on Aug 10 2023 8:15 AM

- - Sakshi

మెదక్‌: సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నర్సాపూర్‌ నియోజకవర్గంపై బీసీ నాయకులు దృష్టి సారించారు. అసెంబ్లీ టికెట్‌ను తమ సామాజిక వర్గానికి కేటాయించాలనే డిమాండ్‌తో ప్రయత్నాలు ప్రారంభించారు.

జనాభాలో అధిక శాతం ఉన్న తమకు పార్టీలు ప్రాధాన్యం ఇవ్వాలంటూ జిల్లాలో ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో బహిరంగంగానే ప్రకటించారు. మరోవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు బీసీలకు టికెట్లు కేటాయించేందుకు సముఖంగా ఉండడం కూడా వీరికి కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు.

దీనికి అనుగుణంగా జిల్లాలోని బీసీ నాయకులు టికెట్‌ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా నర్సాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిని పోటీలో ఉంచేందుకు పావులు కదుపుతున్నారు.

బీఆర్‌ఎస్‌ నుంచి..
నర్సాపూర్‌ నుంచి ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి మరోసారి పోటీకి సై అంటుండగా, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌, మాజీ మంత్రి సునీతారెడ్డి కూడా టికెట్‌ రేసులో ఉన్నారు. కాగా బీసీ కోటాలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు, శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ టికెట్‌ ఆశిస్తున్నారు. 2014, 2018లో రెండు సార్లు ఎంపీపీగా ఎన్నికై న హరికృష్ణ ప్రస్తుతం రేసులో ఉన్నారు.

బీజేపీలో..
బీజేపీ రాష్ట్ర నాయకుడు సింగాయిపల్లి గోపి గతంలో రెండుసార్లు పోటీ చేశారు. మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. బీసీ కోటాలో నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీ యాదవ్‌ సైతం టికెట్‌ ఆశిస్తున్నారు. గతంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం గోపికి ఉంది. ఆయన భార్య రాజమణి ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా పని చేశారు.

కాంగ్రెస్‌లో..
కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్‌, ఉపాధ్యక్షుడు, మెదక్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ గాలి అనిల్‌కుమార్‌ సైతం టికెట్‌పై దృష్టి పెట్టారు. విస్తృతంగా పర్యటిస్తు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సొంత నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నుంచి అవకాశం దొరకకుంటే నర్సాపూర్‌ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement