‘చేతి’లో చెయ్యేసిన నాగం, కూచుకుళ్ల.. అక్కడ బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌..! | - | Sakshi
Sakshi News home page

‘చేతి’లో చెయ్యేసిన నాగం, కూచుకుళ్ల.. ఎన్నికల ఏడాదిలో బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌..!

Jun 18 2023 6:18 AM | Updated on Jun 18 2023 12:29 PM

- - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: కాంగ్రెస్‌లో పార్టీలోకి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. శనివారం హైదరాబాద్‌లో మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డితో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి చర్చలు జరిపారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రేతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో ఇరువురి మధ్య విస్త్రృతస్థాయిలో చర్చ జరిగినట్టు సమాచారం.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఎవరికి వారు తమ అభిప్రాయాలను చెప్పగా.. చివరగా ఇరువురి మధ్య సయోధ్య కుదిరినట్టుగా తెలుస్తోంది. పార్టీ అధిష్టానం టికెట్‌ ఎవరికి ఇచ్చినా ఇరువురు నేతలు సంపూర్ణ మద్దతుతో సహకారం అందించుకోవాలని ముఖ్య నేతలు చెప్పినట్లు తెలిసింది. ఇక కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి త్వరలో కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైనట్టు సమాచారం. మరో నాలుగైదు రోజుల్లోనే కాంగ్రెస్‌ అగ్రనేతల సమక్షంలో కూచుకుళ్ల కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికల ఏడాదిలో బీఆర్‌ఎస్‌కు షాక్‌ ..
సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతుండటంపై జోరుగా చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు.

ఈసారి ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే నియోజకవర్గంలో ఎలాంటి ప్రభావం చూపుతుందోనని బీఆర్‌ఎస్‌ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి పార్టీలో కలవడం తమకు ఎంతో కలసివస్తుందని కాంగ్రెస్‌ శ్రేణులు భావిస్తుండగా, ఆయన పార్టీ మారినా తమకు ఢోకా ఉండదని బీఆర్‌ఎస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement