మహిళా కానిస్టేబుల్‌ మృతి! భర్తే హత్య చేశాడా? | - | Sakshi
Sakshi News home page

మహిళా కానిస్టేబుల్‌ మృతి! భర్తే హత్య చేశాడా?

Dec 30 2023 12:04 AM | Updated on Dec 30 2023 12:10 PM

- - Sakshi

ఖమ్మం: ఖమ్మం 4వ డివిజన్‌ బాలాజీనగర్‌లో నివాసముంటూ భద్రాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న మీగడ స్వాతి (29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఖమ్మం అర్బన్‌ ఎస్‌ఐ పి.వెంకన్న కథనం ప్రకారం.. స్వాతి రెండేళ్ల కిందట ఖమ్మంలో విధులు నిర్వర్తిస్తున్న సమయాన రాజీవ్‌నగర్‌గుట్టకు చెందిన కారుడ్రైవర్‌ ప్రవీణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

కొన్ని నెలలు పాటు దాంపత్య జీవితం సజావుగానే సాగింది. వీరికి 19 నెలల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వరకట్నం తీసుకురావాలని ప్రవీణ్‌ వేధిస్తుండడంతో స్వాతి అప్పు చేసి రూ.9 లక్షలు, తండ్రి నుంచి మరో రూ.14 లక్షలకు పైగా ఇప్పించింది. అయినా సంతృప్తి చెందని ప్రవీణ్‌ మద్యం సేవిస్తూ ఏపని చేయకుండా నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలోనే గురువారం ఇంట్లో స్వాతి, ప్రవీణ్‌ ఘర్షణ పడినట్లు తెలుస్తుండగా పెద్దగా శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలిపారు.

దీంతో సమీపంలోనే ఉండే స్వాతి సోదరి కవిత వచ్చేసరికి స్వాతి కిందపడుకుని, ఉందని, ఏమైందని ఆరా తీస్తే ఉరి వేసుకుందని ప్రవీణ్‌ చెప్పాడని కవిత వెల్లడించింది. అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. కాగా, ప్రవీణ్‌ ఉరి వేసి స్వాతిని హత్య చేసినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని కవిత ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇవి చ‌ద‌వండి: కన్నతల్లి అంత్యక్రియలకు వెళ్లనివ్వకుండా నిర్బంధం

Advertisement
 
Advertisement
Advertisement