కోలారు: నగరంలోని పీసీ కాలనీలో ఉన్న శ్రీ రేణుకా యల్లమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం అమ్మవారికి విశేష పూజా వేడుకలను నిర్వహించారు. ప్రధాన అర్చకులు సురేష్ ఆర్య నేతృత్వంలో పూజలు సాగాయి. అమ్మవారికి అభిషేకం, పూజలు, నైవేద్య సమర్పణం గావించారు. కమిటీ అధ్యక్షుడు కె.గణేశ్ సహా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మైనర్ ప్రేమ, హత్య
కేసులో దర్యాప్తు
దొడ్డబళ్లాపురం: మైనర్ బాలుడు, బాలిక ఇన్స్టా పరిచయంతో ప్రేమలో పడి సహజీవనం చేయడం, బాలికపై అనుమానంతో బాలుడు తుపాకీతో కాల్చిచంపిన కేసులో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. కనకపుర తాలూకా కెంపాలనాథ గ్రామంలో ఈ ఘోరం జరగడం తెలిసిందే. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరపగా హత్య వెలుగుచూసింది. పోలీసులు శనివారంనాడు తహసీల్దార్ సమక్షంలో పొలంలో బాలిక మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. తరువాత మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడు, అన్న, అతని బంధువును విచారిస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: వరకట్నం వేధింపులు, ఆపై సంతానం కలగకపోవడంతో వివాహిత బలవన్మణం చెందిన సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా తొరెనాగసంద్ర గ్రామంలో జరిగింది. వివరాలు.. మూడేళ్ల క్రితం తుమకూరు జిల్లా కొరటగెరెకు చెందిన కావ్య (25)కు తొరెనాగసంద్రవాసి నవీన్ అనే వ్యక్తితో వివాహం జరిపించారు. ఇప్పటివరకు పిల్లలు పుట్టలేదు, పైగా పుట్టింటి నుంచి మరింత కట్నం తీసుకురావాలని భర్తతో పాటు అత్తమామలు ఆమెను వేధించేవారు. దీంతో విరక్తి చెందిన కావ్య గదిలో కావ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దుండప్ప.. గ్రేటప్పా
● రైతు అవయవదానం
దొడ్డబళ్లాపురం: ప్రమాదంలో బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేయడం ద్వారా కుటుంబ సభ్యులు మానవత్వం చాటుకున్న సంఘటన బెళగావిలో జరిగింది. బాగలకోట జిల్లా ముధోళ తాలూకా జూన్నూర గ్రామం నివాసి, రైతు దుండప్ప (55), ధార్వాడ రైల్వేస్టేషన్లో రైలు ఎక్కే క్రమంలో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కాగా, ధార్వాడ ఎస్డీఎం ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స ఫలించకపోగా ఆయన బ్రెయిన్డెడ్ అయ్యారని వైద్యులు తెలిపారు. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు దుండప్ప అవయవాలు దానం చేయడానికి ఒప్పుకున్నారు. జీరో ట్రాఫిక్ ఏర్పాటు చేసుకుని అంబులెన్స్లో బెళగావి కేఎల్ఈ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ ముఖ్యమైన అవయవాలను సేకరించి అవసరమైన ఆస్పత్రులకు తరలించారు.


