బళ్లారిఅర్బన్: బిహార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షురాలు కాంతి కుమారిని వెంటనే విడుదల చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద కొనసాగుతున్న నిరాహార దీక్షకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం బళ్లారి రాయల్ సర్కిల్లో నిరసన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్.దొడ్డ బసవరాజ్ మాట్లాడుతూ నీట్, నెట్, పీజీసీఈటీ తదితర పరీక్షల్లో జరిగిన ప్రశ్న పత్రాల లీకేజీలు దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయని అన్నారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని, సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్షకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కాంతి కుమారిని వెంటనే విడుదల చేయాలన, విద్యా వ్యవస్థలో లోపాలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ తాలూకా అధ్యక్షుడు ఎం.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని వసతి నిలయాలు, విద్యాసంస్థలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కోరారు. తాలూకా కార్యదర్శి వరదరాజ్ విద్యార్థులు తమ విద్యా హక్కుల పరిరక్షణకు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నిరసనలో నాగేంద్ర హుసేనితో పాటు ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


