● కూలడానికి సిద్ధంగా భవనాలు
● భయంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది
దోమకొండ: మండలకేంద్రంలో పశువైద్యశాల శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉంది.అందులో పనిచేస్తున్న సిబ్బంది భయంభయంగా విధులు నిర్వహిస్తున్నారు. భవనంలో పాముల పుట్టలు వెలిశాయి. దీంతో వైద్య సిబ్బంది, పాడిరైతులు ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే సామగ్రి నిల్వ కోసం కట్టిన గదిలో సేవలను అందిస్తున్నారు. అలాగే కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద, మద్నూర్ ప్రాంతాల్లో వెటర్నరీ ఏడీ కార్యాలయాలున్నాయి. జిల్లాలో 30 మండల స్థాయి పశువైద్యశాలలు, మరో 16 గ్రామాల్లో సబ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా శిథిలావస్థకు చేరాయి. చాలా పశువైద్యశాలల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత కూడా ఉంది. పశువులు, గొర్రెలు రోగాల బారిన పడకుండా ప్రతిఏటా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి మందులు అందజేయాల్సి ఉంటుంది. అధికారులు స్పందించి దోమకొండలో పశువైద్యశాల నూతన భవనం నిర్మించాలని పాడి రైతులు కోరుతున్నారు.


