ముసాయిదా జాబితాను పరిశీలించాలి
కామారెడ్డి క్రైం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ మొదటి ఘట్టం జిల్లాలో సోమవారం విజయవంతంగా పూర్తయ్యింది. సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల ముద్రణ, పంపిణీలను ఇది వరకే 100 శాతం పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం, ఓటర్ల ద్వారా స్వీకరించిన ఫారాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను సైతం పూర్తి చేసింది. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 6,96,006 మంది ఓటర్లు ఉండగా, వాటిలో 84,438 ఫారాలను అధికారులు ధృవీకరించకుండా తిరస్కరించారు. మిగిలిన 6,11,568 ఫారాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితా, ఆపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
నియోజకవర్గాల వారీగా..
జిల్లాలో సర్ ప్రక్రియ నియోజకవర్గాల వారీగా ఇలా ఉంది. జుక్కల్ నియోజకవర్గంలో 2,06, 343 మంది ఓటర్లకు ఎన్నికల ఫారాల పంపిణీ చేసి 90.27 శాతం వివరాల డిజిటైజేషన్, ఎల్లారెడ్డి పరిధిలోని 2,28,503 మంది ఓటర్లకు గాను 90.17 శాతం, కామారెడ్డిలో 2,61,160 మంది ఓటర్లకు గాను 83.96 శాతం వివరాల డిజిటైజేషన్ పూర్తయ్యింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా మరణించిన ఓటర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు, ఇప్పటికే మరోచోట నమోదైన వారు, గైర్హాజరైన ఓటర్లు తదితర వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత వర్గీకరణలను స్పష్టంగా నమోదు చేశారు.
జిల్లాలో సర్ విజయవంతంగా పూర్తయ్యింది. మొత్తం 796 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన 6,96,006 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశాం. సర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించిన అనంతరం ప్రతి ఓటరు తమ పేరు, చిరునామా, వయస్సు, ఇతర వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. ఏవైనా తప్పులు ఉన్నా, పేరు లేకపోయినా, ఇతర అభ్యంతరాలున్నా, సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి సవరణలు, అభ్యంతరాలు నమోదు చేసుకోవాలి. ఓటర్ల వివరాల కచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రక్రయను పూర్తి చేశాం. – ఆశిష్ సంగ్వాన్, కలెక్టర్, కామారెడ్డి
6,11, 568 ఓట్ల డిజిటలైజేషన్ పూర్తి
తొలగించదగిన ఓట్లు 84,438
87.87 శాతం డిజిటలైజేషన్
17న ముసాయిదా ఓటరు జాబితా,
ఆపై అభ్యంతరాల స్వీకరణ
పారదర్శకంగా పూర్తి చేశామని
కలెక్టర్ ప్రకటన


