
థాయ్లాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా(38)కు అధికారం చేపట్టిన పది నెలలకే పదవీగండం ఎదురైంది. పొరుగుదేశం నేతకు ఆమె చేసిన ఓ ఫోన్ కాల్ లీక్ అవడం.. ఏకంగా ప్రధాని పీఠానికి ఎసరు పెట్టింది. ఆమెను రాజీనామా చేయాలంటూ ఒకవైపు డిమాండ్లు వెల్లువెత్తగా.. ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాన భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
థాయ్లాండ్ బిలియనీర్, మాజీ ప్రధాని అయిన తక్సిన్ షినవత్రా కుమార్తె ప్రస్తుత థాయ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా((Thailand PM Paetongtarn Shinawatra). గతేడాది ఆగస్టులో ఆమె ఆ పదవిని చేపట్టారు. 37 ఏళ్లకే ప్రధాని పీఠాన్ని అధిష్టించిన ఆమె.. ఆ దేశ చరిత్రలోనే అతి పిన్న ప్రధానిగా, రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు.. అందం, ఫ్యాషన్స్లోనూ స్టైల్ ఐకాన్గా, బ్యూటిఫుల్ పీఎంగా నెట్టింట విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు.

కాల్ సంభాషణ బయటకు..
థాయ్లాండ్ (Thailand)కు పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్(Hun Sen)కి థాయ్ ప్రధాని షినవత్రా ఫోన్ చేశారు. ‘‘అంకుల్’’ అంటూ ఆయనను సంబోధించిన ఆమె.. తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా సరిహద్దులో థాయ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బూన్సిన్ (Lt. Gen. Boonsin Padklangను ఉద్దేశించి) తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఆమె ఆయనతో చెప్పారు పేర్కొన్నారు. అయితే, జూన్ 15వ తేదీన జరిగిన ఈ ఫోన్కాల్ సంభాషణ తాజాగా బయటకు వచ్చింది.
సాధారణంగానే కంబోడియా-థాయ్లాండ్ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పైగా సరిహద్దు వివాదాల కారణంగా ఈ మధ్యకాలంలో(మే 28వ తేదీ నుంచి) అవి మరింతగా దెబ్బతిన్నాయి. అయితే.. 2023లో హున్ సేన్ ప్రధాని పదవి నుంచి దిగిపోగా.. ఆయన కుమారుడు హున్ మానెట్ అధికార పగ్గాలు చేపట్టారు. పదవిలో లేకపోయినా కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి హున్సేన్. అలాంటి వ్యక్తితో షినవత్రా ఫోన్లో మాట్లాడడం.. పైగా దేశ భద్రతకు సంధించిన విషయాలను ప్రత్యర్థితో పంచుకున్న తీరు కూడా వివాదాస్పదమైంది.

సొంత పక్షం నుంచే ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని ఫోన్తో తమ దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ షినవత్రా సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ భూమ్జాయ్థాయ్ పార్టీ విడిపోయింది. ప్రస్తుతం థాయ్ పార్లమెంట్లో కనీసం 69 మంది ఎంపీలు ఆమెకు మద్దతు విరమించుకున్నారు. దీంతో షినవత్రాకు స్వల్ప మెజార్టీ(500 సభ్యులన్న పార్లమెంట్లో 254 సభ్యుల మద్దతు) మాత్రమే మిగిలింది. ఈ వివాదం ఇలాగే కొనసాగినా.. మరో మిత్రపక్షం వైదొలిగినా.. ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది.

చేతులు జోడించి..
ఈలోపు ఈ బ్యూటీఫుల్ ప్రధాని డ్యామేజ్ కంట్రోల్కి దిగారు. ఫోన్ కాల్ లీక్ వ్యవహారంపై ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆర్మీ, పోలీస్ అధినేతల సమక్షంలో చేతులు జోడించి ఆమె ఆ పని చేశారు. నా ఉద్దేశం శాంతిని నెలకొల్పడమే. ఇకపై హున్ సేన్తో ప్రైవేట్ సంభాషణలు ఉండవని తేల్చి చెప్పారామె. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని, సైన్యానికి అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారామె. ఈ క్షమాపణ థాయ్లాండ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడకుండా ఆపుతుందా చూడాలి.