ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు | Trump Netanyahu Phone Call Sparks Tension Over Iran Action | Sakshi
Sakshi News home page

ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు

May 21 2026 9:02 AM | Updated on May 21 2026 11:54 AM

Trump Netanyahu Phone Call Sparks Tension Over Iran Action

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య బుధవారం జరిగిన ఒక గంట ఫోన్ సంభాషణ అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు కొనసాగించాలా లేక సైనిక చర్యలకు దిగాలా అనే అంశంపై వాషింగ్టన్, టెల్ అవీవ్ మధ్య ఏర్పడిన విబేధాలు ఈ కాల్‌తో బయటపడ్డాయి. గత ఏప్రిల్ 8న కుదిరిన కాల్పుల విరమణ తర్వాత ఇరుపక్షాల మధ్య హెచ్చరికలు కొనసాగుతున్న తరుణంలో, అమెరికా మీడియా సంస్థ ‘అక్సియోస్’ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ చర్చల తర్వాత నెతన్యాహు తీవ్ర ఆగ్రహానికి, ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది.

ట్రంప్ దౌత్య వ్యూహం.. నెతన్యాహు అసంతృప్తి
ఖతార్, పాకిస్తాన్ దేశాలు ప్రతిపాదించి, సవరించిన శాంతి ఒప్పందంపై ట్రంప్ మొగ్గు చూపుతుండగా, నెతన్యాహు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్ కేవలం కాలయాపన కోసమే ఈ చర్చలను వాడుకుంటోందని, సైనిక దాడులను ఆపడం చారిత్రక తప్పిదమని నెతన్యాహు వాదించారు. అయితే, ‘మంచి ఒప్పందమైనా కుదురుతుంది లేదా గట్టి చర్యలైనా ఉంటాయి’ అని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ప్రతిపాదించిన ‘ఆపరేషన్ స్లెడ్జ్‌హామర్’ దాడులను గల్ఫ్ మిత్రదేశాల కోరిక మేరకు ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ట్రంప్ ఈ కాల్‌లో పేర్కొన్నారు.

హోర్ముజ్ జలసంధి సంక్షోభం - అంతర్జాతీయ ఆందోళన
మరోవైపు, ప్రపంచ ఇంధన సరఫరాలో ఐదో వంతు వాటా కలిగిన హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ఆర్థిక మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఇరాన్ తన పర్యవేక్షణలో కొన్ని నౌకలను అనుమతించినప్పటికీ, అమెరికా నేతృత్వంలోని కౌంటర్-బ్లాకేడ్ ఇంకా కొనసాగుతోంది. ఈ అంతరాయం ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం, ఎరువుల కొరత ఏర్పడుతుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఎఫ్ఎఓ హెచ్చరించింది. అయితే చర్చలు సఫలమైతే చమురు ధరలు తగ్గుతాయనే ఆశతో మార్కెట్లు కొద్దిగా కోలుకున్నాయి.

ఇరాన్ హెచ్చరిక.. యుద్ధ గండం ఇంకా తొలగలేదు
అమెరికా పంపిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపినప్పటికీ, వారి  వైఖరి మారలేదు. స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని, పోర్టులపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది. ఇరాన్ చీఫ్ నెగోషియేటర్ మహ్మద్ బాఖెర్ గాలిబాఫ్ మాట్లాడుతూ అమెరికా దౌత్యం ముసుగులో కొత్త యుద్ధానికి తెరలేపుతోందని ఆరోపించారు. ఒకవేళ ఇరాన్‌పై మళ్లీ దాడి జరిగితే, ఆ యుద్ధం కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాదని, శత్రువులను నామరూపాలు లేకుండా చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: నాడు మనసులు కలిస్తే.. నేడు డేటా సరిపోలితే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement