‘పెద్దలు’ దావోస్‌ వెళ్లేది అందుకేనా..? | Satires Comments On Davos Meetings In Social Media | Sakshi
Sakshi News home page

‘పెద్దలు’ దావోస్‌ వెళ్లేది అందుకేనా..?

Jan 29 2025 1:51 PM | Updated on Feb 1 2025 9:22 AM

Satires Comments On Davos Meetings In Social Media
  • అసలుకన్నా కొసరు మీదే మక్కువ
  • విలాసాలు కులాసాలే ఎక్కువ
  • పెట్టుబడుల కన్నా.. ఇతర వ్యవహారాలకే ప్రాధాన్యం
  • జాతీయ మీడియాలో వెల్లువెత్తుతున్న కథనాలు
  • సోషల్‌ మీడియాలో సెటైర్లు.. కామెంట్లు

వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF)దావోస్‌లో పెట్టుబడుల సదస్సు అంటూ జనవరి 20-24 తేదీల మధ్య నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం అబాసుపాలైంది. ఈ సదస్సులో పెట్టుబడులు,వ్యాపారం,పరిశ్రమల స్థాపన,ఆయా రంగాల్లో నిపుణులు,అనుభవజ్ఞులతో చర్చలు, ఉపచర్చలు అంతిమంగా ఆరోగ్యకరమైన పారిశ్రామిక విధానాల రూపకల్పన వంటివి ఉంటాయనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. 

అసలా సదస్సు ఉద్దేశ్యం అదే అయినా..వెళ్లినవారి ఉద్దేశాలు వేరని అందరూ అక్కడికి విలాసాలకు కులాసాలకు మాత్రమే వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి  హోటల్స్ రిసార్ట్స్ బుకింగ్స్ బట్టి ఇదే అర్థం అవుతోందని జాతీయ,అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.అక్కడికి వచ్చేవారికి వారి కోరికమేరకు 'వ్యక్తిగత సేవలు' అందించే సంస్థలకు భారీ గిరాకీ దక్కిందని ఈ సర్వీసుల సేవల విలువ దాదాపు రూ.పదికోట్ల పైమాటే అని ఆ కథనాల్లో వివరిస్తున్నారు.

పెట్టుబడులు,పారిశ్రామిక విధానాలు,వాతావరణ మార్పుల మీద చర్చలకన్నా అక్కడికి ధనికులు 'గాలి మార్పు' రిలాక్సేషన్‌ కోసమే ఎక్కువ తాపత్రయపడినట్లు ఓ అంతర్గత నివేదిక బయటకు వచ్చింది. స్విట్జర్లాండ్ లో అలాంటి సేవలు అందించే సంస్థలకు దావోస్‌ సదస్సు టైమ్‌లో డిమాండ్ గణనీయంగా పెరిగింది అంటూ బ్రిటన్ నుంచి వెలువడే డైలీ మెయిల్ పత్రిక,వెబ్ సైట్ ఒక సంచలన కథనాన్ని వెలువరించింది. 

ఇలాంటి బుకింగ్స్ అందుబాటులో ఉంచే ఒక వెబ్ సైట్ ఐతే మొదటి రెండు మూడు రోజుల్లోనే దాదాపు రూ.3 కోట్లు ఆర్జించింది.గత ఏడాది ఈ సర్వీసులు కేవలం 170 సంస్థలు మాత్రమే అందించగా ఈసారి వాటి సంఖ్య దాదాపు మూడు వందలకు పెరిగిందట.దావోస్‌లో పెట్టుబడులు అంటూ వెళ్లే పెద్దలు..పెద్దల ముసుగులో వెళ్లే నాయకులూ అక్కడకు వెళ్లి చేసే రాచకార్యాలు ఇవీ అంటూ హిందూస్తాన్ టైమ్స్,ఎకనామిక్ టైమ్స్ తో పాటు పలు వెబ్ సైట్స్ కూడా బోలెడు ఇన్‌సైడర్ కథనాలు ప్రచురించాయి.దీనిమీద సోషల్ మీడియాలోనూ పంచులు పేలుతున్నాయి. 

ఓ నెటిజన్ అయితే దావోస్‌ సదస్సుమీద వ్యంగ్యంగా పాట కూడా రాశారు..

గుడివాడ యెల్లాను... గుంటూరు పొయ్యాను... 
దావోసూ పోయాను... ఎన్నెన్నో చూశాను. 
యాడ చూసినా, ఎంత చేసినా ఏదో కావాలంటారు...  
నోళ్ళు... ‘పెట్టుసచ్చిబడుల వేటకు వచ్చినోళ్ళు’. అంటూ పాట రాశారు. మొత్తానికి పెట్టుబడుల వేట అంటూ వెళ్లిన వేటగాళ్లు.. అసలు పనికన్నా కొసరూపానికి ప్రాధాన్యం ఇచ్చారని.. మీడియా.. సోషల్ మీడియా కోడై కూస్తోంది..

-- సిమ్మాదిరప్పన్న 

Advertisement
 
Advertisement
Advertisement