పాక్‌ టార్గెట్‌ అమెరికా??.. ఇది జోక్‌ కాదు బాస్‌! | Pak Really Develop ICBM With China Help US Intel Report Says This | Sakshi
Sakshi News home page

పాక్‌ టార్గెట్‌ అమెరికా??.. ఇది జోక్‌ కాదు బాస్‌!

Jun 25 2025 2:32 PM | Updated on Jun 25 2025 3:03 PM

Pak Really Develop ICBM With China Help US Intel Report Says This

ఎవ్వడ్రా వీడు.. ఘోల్లుమనే జోక్‌ వేశాడు అనుకుంటున్నారా?. కానీ ఇదే నిజం. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ప్రపంచమంతా దృష్టిసారించిన వేళ..పాక్‌ రహస్యంగా శక్తివంతమైన.. అదీ న్యూక్లియర్‌ బాలిస్టిక్‌ మిసైళ్ల తయారీ చేపట్టింది!. ఈ విషయాన్ని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించినట్లు ఫారిన్‌ ఎఫైర్స్‌ అనే పత్రిక కథనం ప్రచురించింది. 

దీర్ఘ శ్రేణి నూక్లియర్‌ బాలిస్టిక్‌ మిసైళ్ల(ICBM) తయారీని పాకిస్థాన్‌ రహస్యంగా చేపడుతోంది. వీటి సామర్థ్యం ఏకంగా.. అమెరికాకు చేరుకోగలదని వెల్లడించింది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత.. చైనా సాయంతో పాక్‌ వీటిని అభివృద్ధి చేస్తోంది. ఒకవేళ పాకిస్థాన్‌ అలాంటి క్షిపణులను సమకూర్చుకుంటే.. ఆ దేశాన్ని అణ్వస్త్ర శత్రువుగా అమెరికా గుర్తించడం ఖాయమని వాషింగ్టన్‌ నిఘా వర్గాలు స్పష్టం చేశాయని సదరు కథనం పేర్కొంది.

అమెరికాను తాకగలిగే అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశం ఏదైనా సరే.. అమెరికాకు శత్రువుగానే చూడాల్సి వస్తుందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యలను సదరు నివేదిక ప్రముఖంగా పేర్కొంది. ఈ కథనాన్ని వైట్‌హౌజ్‌ వర్గాలు ధృవీకరించాల్సి ఉంది. 

ఐసీబీఎం అంటే.. ఖండాలను దాటగలిగే సామర్థ్యం ఉన్న క్షిపణులు. ఇందులో అణ్వాయుధాలతో పాటు సాధారణ యుద్ధ క్షిపణులు కూడా ఉంటాయి. వీటి లక్ష్యం.. 5,500 కిలోమీటర్లు దాకా ఉండొచ్చు. అయితే ప్రస్తుతానికి పాక్‌ దగ్గర అలాంటి క్షిపణలేం లేవు. ప్రస్తుతం అమెరికా జాబితాలో రష్యా, చైనా, ఉత్తర కొరియాలు ఉన్నాయి.

భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాకిస్తాన్‌ తన ఆర్థికాభివృద్ధిని పణంగా పెట్టి.. ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిపెట్టిందని ఆ దేశ మీడియా నుంచే కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే దేశ రక్షణ బడ్జెట్‌ను 20 శాతం పెంచింది. ఏకంగా 9 బిలియన్‌ డాలర్లకు కేటాయించింది. షెహ్‌బాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాక్‌ ప్రభుత్వం ఆ దేశ ఫీల్డ్‌ మార్షల్‌ అసిమ్‌ మునీర్‌ డిమాండ్లను సంతృప్తిపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ బడ్జెట్‌లో పెంచిన నిధులతో ఆపరేషన్‌ సిందూర్‌లో దెబ్బతిన్న టెర్రర్‌ క్యాంప్‌లను మళ్లీ పునరుద్ధరించనుందని తెలుస్తోంది. అలాగే చైనా నుంచి భారీగా ఆయుధ సంపత్తిని పాక్‌ దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. 

ప్రస్తుతానికైతే ఆ దేశ విధానంలో.. షార్ట్‌, మీడియం రేంజ్‌ మిస్సైల్స్‌ మాత్రమే ఉన్నాయి. చివరగా.. 2022లో పాక్‌ మీడియం రేంజ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ షాహీన్‌-3ను ప్రయోగించింది. దీని పరిధి.. 2,700 కిలోమీటర్లు. ఇదిలా ఉంటే.. తమ దేశం చేపట్టే అణు పరీక్షలు భారత్‌ ముప్పును ఎదుర్కొనేందుకేనని పాక్‌ పలుమార్లు బాహాటంగానే ప్రకటించుకుంది. కిందటి ఏడాది.. పాక్‌ మీద లాంగ్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ కార్యక్రమంపై అమెరికా ఆంక్షలు విధించగా.. పాక్‌ వాటిని పక్షపాత ధోరణిగా ప్రకటించింది.

ప్రస్తుతం పాక్‌ దగ్గర 170 న్యూక్లియర్‌ వార్‌హెడ్స్‌ ఉన్నాయి. తద్వారా న్యూక్లియర్‌ నాన్‌ ప్రొలైఫ్‌రేషన్‌ ట్రీటీ(NPT)కి పరిధిని ఉల్లంఘించింది.  న్యూక్లియర్‌ వెపన్స్‌ను కట్టడి చేయడం, తద్వారా అణు శక్తిని పరిమితంగా(శాంతి పరిధికి లోబడి) ఉపయోగించుకోవాలని చెప్పడం ఈ ఒప్పంద ఉద్దేశం.

ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత సైన్యం.. మే నెలలో పాక్‌ ఉగ్రశిబిరాలపై, ఆ దేశ ప్రధాన ఎయిర్‌బేస్‌లపై దాడులు జరిపింది. ఆ సమయంలో పాక్‌ తన హైపర్‌సోనిక్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ ప్రయోగించిందని.. అయితే భారత రోబస్ట్‌ ఎయిర్‌డిఫెన్స్‌ సిస్టమ్‌ దానిని అడ్డుకుందనే ప్రచారం జోరుగా నడిచింది. అటుపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా పలువురు కేంద్రమంత్రులు పాక్‌ న్యూక్లియర్‌ కార్యకలాపాలపై దృష్టిసారించాలని ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీని కోరారు. పాక్‌ అలాంటి ఆయుధాల విషయంలో హద్దులు మీరి ప్రవర్తించదనే ఆశిస్తున్నట్లు రాజ్‌నాథ్‌ కూడా వేరుగా ఓ ప్రకటన చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement