ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ బహిరంగంగా హాజరయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది. తీవ్ర భద్రతా ఆందోళనలే ఇందుకు కారణమని భారతదేశంలోని సుప్రీం లీడర్ ప్రతినిధి అయతొల్లా హకీమ్ ఎలాహీ తెలిపారు.
ఓ ఇంటర్వ్యూలో అయతొల్లా హకీమ్ ఎలాహీ మాట్లాడుతూ.. అంత్యక్రియలకు ముందు ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. "గత వారం నేను ఇరాన్లో ఉన్నాను. మొజ్తబాను కలిసిన నా స్నేహితులతో మాట్లాడాను. ఆయన బయటకు రావాలని, ప్రజలను కలవాలని కోరుకుంటున్నారని వారు చెప్పారు. కానీ, భద్రతా సిబ్బంది అందుకు అనుమతించడం లేదు. అది చాలా ప్రమాదకరమని, ఆయనకు భద్రత కల్పించడం సాధ్యం కాదని వారు చెప్పారు. ఆయన బయటకు రారని నేను భావిస్తున్నాను" అని ఎలాహీ చెప్పారు.
కాగా, ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది ప్రముఖులు అయతొల్లా అలీ ఖమేనీకి తుది వీడ్కోలు చెప్పేందుకు టెహ్రాన్కు చేరుకుంటున్నారు. ఇరాన్కు ఇజ్రాయెల్, అమెరికాతో జరిగిన ఘర్షణల తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అంత్యక్రియలు జరుగుతున్నాయి.
ఇరాన్లో పరిస్థితుల గురించి ఎలాహీ మాట్లాడుతూ.. సుప్రీం లీడర్ మరణించినప్పటి నుంచి దేశమంతా సంతాపంలో ఉందని, ఆయనకు మద్దతు ఇచ్చే వారు ఈ నష్టాన్ని భర్తీ చేయలేనిదిగా భావిస్తున్నారని చెప్పారు. "వారికి ఇది చాలా పెద్ద నష్టం. తమ ఆత్మను, ప్రాణాన్ని కోల్పోయినట్టుగా వారు భావిస్తున్నారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని వారు నమ్ముతున్నారు" అని చెప్పారు.
ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు జులై 4న టెహ్రాన్లో ప్రారంభం కానున్నాయి. అనంతరం జులై 7న ఖోమ్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరగా జులై 9న ఆయన స్వస్థలం మష్హద్లో అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేస్తారు. అయితే, జులై 3న టెహ్రాన్లో జరిగే సంతాప కార్యక్రమానికి విదేశీ ప్రతినిధులు హాజరవుతారు.


