
ఏమీ ఎరుగని పూవుల్లారా,
అయిదారేడుల పాపల్లారా!
మెరుపు మెరిస్తే,
వాన కురిస్తే,
ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మీకే అని ఆనందించే
కూనల్లారా!..
రెండేళ్ల వయసులో ఎలా ఉండాలి?.. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ.. తల్లిదండ్రుల ఒడిలో సేదతీరుతూ ఉండాలి . కానీ, ఈ చిన్నారి మాత్రం తోటి పిల్లలతో కలిసి ఎక్కడ నీరు దొరక్కుండా పోతుందా? అనే భయంతో పరుగులు ఇలా పెడుతోంది. తమ బిడ్డలకు అందమైన బాల్యం చెక్కాలని ఆ దేవుడ్ని మొక్కుకోని తల్లిదండ్రులు ఉంటారా?. కానీ, తమ బిడ్డలు ప్రాణాలతో ఉంటే చాలని వేడుకుంటున్నారు గాజా ప్రజలు.
గాజా.. గత ఏడాదిన్నరగా ఇజ్రాయెల్ దాడులతో.. తీవ్ర మానవ సంక్షోభంతో అల్లలాడుతున్న నేల. మానవతా సాయం ఆగిపోవడంతో సంక్షోభం తలెత్తి చివరకు తిండి, మంచి నీటిని కూడా పరిమితులు విధించడంతో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి.
యూనిసెఫ్ గణాంకాల ప్రకారం..ప్రస్తుతం కల్లోల గాజాలో చిన్నారులకు రోజుకి ఒకటిన్నర నుంచి 2 లీటర్ల నీరు అందిస్తున్నారు. సాధారణంగా.. అన్ని అవసరాలకు కలిపి 15 లీటర్ల నీరు ఒకరోజుకి అవసరం పడుతాయి. ఇందులో తాగు నీటికే 3 లీటర్ల అవసరం. అలాంటిది ఇక్కడి చిన్నారులకు ఒకరోజులో 2 లీటర్ల లోపే నీరు అందుతుండడం.. సంక్షోభ తీవ్రతను తెలియజేస్తోంది.
గణాంకాలు.. కఠోర వాస్తవాలు
- గాజాలో 2023 అక్టోబర్ నుండి ప్రారంభమైన యుద్ధంలో వేలాది మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు, మరియు ఈ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
- 2023లోనే గాజాలో జరిగిన దాడుల్లో పిల్లలే అత్యధికంగా మరణించారు అని జెనీవాలో యునిసెఫ్ ప్రతినిధి జేమ్స్ ఎల్టర్ ప్రకటించారు.

మొత్తం గాజా మరణాల్లో.. 70% మరణాలు మహిళలు మరియు పిల్లలే అని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. యుద్ధం, ఆకలి, నీటికొరత, వైద్య సౌకర్యాల లేమి కారణంగా 14,000 మంది పిల్లలు మరణించే ప్రమాదం ఉంది అని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.
ఇంకా..
- 19 లక్షల మంది స్థానభ్రంశం చెందారు, వారిలో సగానికి పైగా పిల్లలే.
- 370 స్కూళ్లు నేలమట్టమయ్యాయి, పిల్లలు విద్యా అవకాశాలు కోల్పోయారు.
- నీటి లభ్యత 5%కి పడిపోయింది, దీని వల్ల డీహైడ్రేషన్తో పసికందులు మరణిస్తున్నారు.
బాల్యం అనే భావన అక్కడ పూర్తిగా విచ్ఛిన్నమైందని యునిసెఫ్ పేర్కొంది. ఈ గణాంకాలు గాజాలోని పిల్లల పరిస్థితి ఎంత భయానకంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి.
*పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-
కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ
ఏమీ ఎరుగని పూవుల్లారా,
అయిదారేడుల పాపల్లారా!
మెరుపు మెరిస్తే,
వాన కురిస్తే,
ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మీకే అని ఆనందించే
కూనల్లారా!
అచ్చటికిచ్చటి కనుకోకుండా
ఎచ్చటెచటికో ఎగురుతుపోయే
ఈలలు వేస్తూ ఎగురుతుపోయే
పిట్టల్లారా!
పిల్లల్లారా!
గరికిపచ్చ మైదానాల్లోనూ,
తామరపూవుల కోనేరులలో
పంటచేలలో, బొమ్మరిళ్లలో,
తండ్రి సందిటా, తల్లి కౌగిటా,
దేహధూళితో, కచభారంతో,
నోళుల వ్రేళులు, పాలబుగ్గలూ,
ఎక్కడ చూస్తే అక్కడ మీరై
విశ్వరూపమున విహరిస్తుండే
పరమాత్మలు
ఓ చిరుతల్లారా!
మీదే, మీదే సమస్తవిశ్వం!
మీరే లోకపు భాగ్యవిధాతలు!
మీ హాసంలో మెరుగులు తీరును
వచ్చేనాళ్ల విభాప్రభాతములు!
ఋతువుల రాణి వసంతకాలం
మంత్రకవాటం తెరచుకునీ,
కంచు వృషభముల అగ్నిశ్వాసం
క్రక్కే గ్రీష్మం కదలాడీ,
ఏళ్లు, బయళ్లూ, వూళ్లూ, బీళ్లూ
ఏకంచేసే వర్షాకాలం,
స్వచ్ఛ కౌముదుల శరన్నిశీథినులు,
హిమానీ నిబిడ హేమంతములు,
చలివడకించే శైశిరకాలం
వస్తూ పోతూ దాగుడుమూతల
క్రీడలాడుతవి మీ నిమత్తమే!
ఇవాళలాగే ఎప్పుడు కూడా
ఇనబింబం పయనించు నింగిపై!
ఎప్పుడు కూడా ఇవాళలాగే
గాలులు వీచును, పూవులు పూచును!
నాకు కనంబడు నానాతారక,
లనేక వర్ణా, లనంత రోచులు
దిక్కు దిక్కులా దివ్యగీతములు
మీరూ వాటికి వారసులే! ఇవి
మీలో కూడా మిలమిలలాడును!
నా గత శైశవ రాగమాలికల
ప్రతిధ్వనులకై,
పోయిన బాల్యపు చెరిగిన పదముల
చిహ్నాల కోసం,
ఒంటరిగా కూర్చిండి వూరువులు
కదిలే గాలికి కబళమునిస్తూ,
ప్రమాద వీణలు కమాచి పాడగ
సెలయేళ్లను, లేళ్లను లాలిస్తూ,
పాతాళానికి పల్టీకొట్టీ
వైతరణీనది లోతులు చూస్తూ,
శాంతములే, కేకాంతముగా, ది
గ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూ
మెటిక విరుస్తూ ఇట కూర్చిండిన
నను చూస్తుంటే నవ్వొస్తోందా?
ఉడుతల్లారా!
బుడతల్లారా!
ఇది నా గీతం, వింటారా?*
సేకరణ: శ్రీశ్రీ మహాప్రస్థానం/శైశవగీతి