కెనడాకు భారత్ మరోసారి హెచ్చరికలు..! | India Tells Canada To Withdraw 40 Diplomats: Report | Sakshi
Sakshi News home page

కెనడాకు భారత్ మరోసారి హెచ్చరికలు.. దౌత్యవేత్తలను తగ్గించాలని ఆదేశం..!

Oct 3 2023 4:03 PM | Updated on Oct 3 2023 4:14 PM

India Tells Canada To Withdraw 40 Diplomats - Sakshi

ఢిల్లీ: కెనడా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యూఢిల్లీలో ఉన్న కెనడా దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని భారత్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అక్టోబర్ 10 నాటికి గడువును కూడా విధించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల్లో సమాన దౌత్య అధికారులు ఉండాలనే నియమంపై భారత్ ఇప్పటికే పలుమార్లు కెనడాను కోరిన విషయం తెలిసిందే.  

ప్రస్తుతం ఢిల్లీలో 62 మంది కెనడా దౌత్య అధికారులు ఉంటుండగా.. ఆ సంఖ్యను 41కి తగ్గించుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 10 తర్వాత ఇంకా ఎక్కువ మంది దౌత్య అధికారులు ఉంటే.. వారికి రక్షణను రద్దు చేస్తామని కూడా కేంద్రం స్పష్టం చేసింది. అయితే.. ఈ వార్తలపై అటు.. కేంద్రంగానీ, విదేశాంగ శాఖ గానీ అధికారికంగా స్పందించలేదు.

ప్రస్తుతం కెనడా-భారత్ మధ్య వివాదాస్పద వాతావరణం నెలకొంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదానికి కారణమైంది. ఈ కేసు దర్యాప్తులో సహకరించాలని భారత్‌ను కెనడా డిమాండ్ చేసింది. ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేశారని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఇరుదేశాలు ఆంక్షలు విధించుకున్నాయి. ఆ తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 

ఇదీ చదవండి: ఢిల్లీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు


 

Advertisement
 
Advertisement
Advertisement