
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఐక్యంగా ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కెనడాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న ఆయన ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలను వర్తింపజేయయడం తగదని సూచించారు. జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్ర దాడిని ప్రస్తావిస్తూ, ఈ ఘటనను భారతదేశంపైన, మానవత్వంపైన జరిగిన దాడిగా అభివర్ణించారు.
ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదని, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడి ఆత్మపై జరిగిన దాడి అని ప్రధాని అన్నారు. ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇస్తున్న దేశాలకు ప్రతిఫలం లభిస్తున్నదన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే అన్ని దేశాలకు అది ఆటంకంగా నిలుస్తున్నదని ప్రధాని పేర్కొన్నారు.
ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం ప్రపంచమంతా స్పష్టమైన విధానంతో ముందుకు కదలాలని, అలాకాదని ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ఏ దేశమైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. పశ్చిమ ఆసియా దేశాలు అనిశ్చితి, సంఘర్షణలతో తల్లడిల్లిపోతున్నాయిని, ఆయా దేశాల్లో ఆహారం, ఇంధనం, ఎరువులు,ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతున్నాయన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి వీటిని ప్రపంచ వేదికపైకి తీసుకురావడాన్ని భారత్ తన బాధ్యతగా భావిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: నేడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్తో ట్రంప్ భేటీ